
హైదరాబాద్ : టమాటాలు... ప్రస్తుతం ఈ పేరు వింటేనే సామాన్యులు కంగారుపడిపోతున్నారు. ఆకాశాన్నంటిన టమాటా ధరలు పేద, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. కానీ ఇవే టమాటాలు కొందరు రైతులను రాజులను చేస్తున్నాయి. పెద్దపెద్ద వ్యాపారాలు, ఉద్యోగాలు చేసేవారు కూడా నెలలో కోట్లు సంపాదించలేరు... కానీ కొందరు టమాటా రైతులు రోజుల వ్యవధిలోనే కోట్ల రూపాయలు కళ్లజూస్తున్నారు. ఇలా తెలంగాణకు చెందిన రైతు మహిపాల్ రెడ్డి టమాటా పంట సాగుచేసి కోట్లు సంపాదించడమే కాదు అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మహిపాల్ రెడ్డి దంపతులను సెక్రటేరియట్ కు పిలిపించుకుని మరీ అభినందించడమే కాదు శాలువాతో సత్కరించారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్ నగర్ గ్రామానికి చెందిన బాన్సువాడ మహిపాల్ రెడ్డికి వంద ఎకరాల వ్యవసాయ భూమి వుంది. గతంలో ఎక్కువగా వరి సాగుచేసి ఆశించిన లాభాలు పొందలేకపోయిన ఆయన కూరగాయల సాగువైపు మళ్ళాడు. ఇలా దాదాపు 40 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు సాగుచేస్తున్నాడు. అయితే ఈసారి అతడికి టమాటా రూపంలో జాక్ పాట్ తగిలింది.
ఈసారి టమాటాలు అమ్మడం ద్వారా రైతు మహిపాల్ రెడ్డి కోట్ల రూపాయలు సంపాందించాడు. ఇప్పటికే రెండు కోట్ల రూపాయల విలువైన టమాటాలు అమ్మగా మరో కోటి రూపాయల విలువైన పంట అమ్మకానికి సిద్దంగా వున్నట్లు 40ఏళ్ల ఈ రైతన్న చెబుతున్నాడు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయం చేయడమే కాదు ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్న మహిపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో పడ్డాడు. దీంతో అతడిని పిలిపించుకుని మరీ సన్మానించారు కేసీఆర్.
నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి టమాటా రైతు మహిపాల్ రెడ్డి దంపతులను సెక్రటేరియట్ కు తీసుకువచ్చాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రైతు దంపతులను అభినందించి శాలువా కప్పి సన్మానించారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు, వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా రైతు మహిపాల్ రెడ్డిని అభినందించారు.
వాణిజ్య పంటల సాగు విషయంలో వినూత్నంగా ఆలోచించాలని... మార్కెట్ స్థితిగతులు అంచనా వేసి పంటలు పండించగలిగితే వ్యవసాయంలోనూ అద్భుతాలు సృష్టించవచ్చని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతులు ఎప్పుడూ ఒకే పంట కాకుండా పంటమార్పిడి చేస్తుండాలని... అలాగయితేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రస్తుతం టమాటా పంట రైతులను కోటీశ్వరులను చేస్తోందని... ఇలా లాభదాయక పంటలు సాగు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతులకు సూచించారు.