హైదరాబాద్ లో సంచలనం రేపిన పదవ తరగతి విద్యార్థినిపై అత్యాచారం కేసులో పోర్న్ వీడియోలు చూసి, అందులో ఉన్నట్లు చేయాలనుకోవడం వల్లే అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలింది.
హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాదులోని హయత్ నగర్ లో పదోతరగతి బాలికపై గ్యాంగ్ రేప్ కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేరానికి పాల్పడిన విద్యార్థులు తమ సెల్ ఫోన్లలో తరచుగా పోర్న్ వీడియోలు చూస్తూ.. తాము అలాగే చేయాలని అనుకున్నారు. అందుకోసం తమతో పాటు టెన్త్ క్లాస్ చదువుతున్న తోటి స్నేహితురాలిని ఎంచుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డారు.
టెన్త్ క్లాస్ చదివే ఒక అబ్బాయి తన తల్లిదండ్రుల స్మార్ట్ ఫోన్ తీసుకుని అందులో పోర్న్ వీడియోలు చూసేవాడు. అదే స్కూల్లో చదువుతున్న మరో ముగ్గురు విద్యార్థులకు వాటిని చూపించాడు. ఇది వారికి అలవాటుగా మారింది. రోజు స్కూలు వదిలేయగానే ఈ నలుగురు విద్యార్థులు ఎవ్వరూ లేని ప్రదేశాలకు వెళ్లి ఆ వీడియోలు చూసేవారు. అలా ఓ నెలపాటు ఇలాగే చూశారు. ఆ వీడియోలు చూస్తున్న క్రమంలో అందులో ఉన్నట్లుగా తాము కూడా చేయాలని అనుకున్నారు. దానికోసం అమ్మాయిని ఎంచుకోవాలి కాబట్టి.. తమతోపాటు చదువుకునే బాధిత బాలికను ఎంచుకున్నారు.
పదవ తరగతి విద్యార్థినిపై అత్యాచారం కేసులో.. ఐదుగురి అరెస్ట్..
ఆమె, అందరు అమ్మాయిలలాగా కాకుండా మెంటాలిటీలో కాస్త తేడాగా ఉండటం.. తన వయసుకు తగ్గట్టుగా కాకుండా చిన్నపిల్లలా ప్రవర్తించడం గమనించారు. దీంతో తమ పని సులువు అవుతుందని అనుకున్నారు. అందుకోసం ప్రణాళిక ప్రకారం ఆమెకు మాయమాటలు చెప్పారు. పుస్తకం కావాలంటూ చెప్పి ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా.. తాము చేసిన పనిని ఈ విద్యార్థుల్లో ఒకరు వీడియో తీశారు.
అయితే, ఈ ఘటనలో సామూహిక అత్యాచారానికి సంబంధించి బాధిత బాలిక చదివే స్కూలు, నివసించే ప్రాంతం బహిర్గతం చేయడం విషయంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలుస్తోంది. కొన్ని వార్తా పత్రికలు, టీవీ చానళ్లలో, బాధితురాలు ఇల్లు, ఆమె చదువుతున్న స్కూలు ఫోటోలు ప్రచురించి నట్లు కమిషన్ గుర్తించింది. ఈ మేరకు బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది అని పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, నవంబర్ 29న హయత్ నగర్ లో టెన్త్ క్లాస్ స్టూడెంట్ పై జరిగిన అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఒకే కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. ఒకే తరగతి కావడంతో విద్యార్థిని యువకులతో సన్నిహితంగా ఉండేది. ఇదే అదనుగా భావించి నిందితులు బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. విద్యార్థిని మీద నాలుగు నెలలుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని తెలిసింది. నిందితులంతా మైనర్లేనని పోలీసులు గుర్తించారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.