Telangana : ఏమిటిది మంత్రిగారు ... మీరే ప్రజలను దొంగఓట్లు వేయమంటే ఎలా..!

By Arun Kumar PFirst Published May 3, 2024, 11:17 AM IST
Highlights

ప్రతి ఒక్కరు ఓటు వేయాలని రాజకీయ నాయకులు కోరడం ప్రజాస్వామ్యానికి మంచిదే... కానీ ఒక్కొక్కరు పది ఓట్లు వేయాలని కోరడం మంచిది కాదు... తెలంగాణకు చెందిన ఓ మహిళా మంత్రి మాత్రం తమ పార్టీ గెలుపుకోసం దొంగఓట్లను ప్రోత్సహించేలా మాట్లాడారు. ఇంతకు ఆమె ఏమన్నారంటే... 

మెదక్ : ఆమె బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో వున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజలకు ఆదర్శంగా వుండాలి. ఎవరైనా తప్పు చేస్తే మందలించాల్సిన మంత్రిగారే తప్పు చేయమని ప్రజలకు సూచిస్తున్నారు. తమ రాజకీయాల కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మహిళా మంత్రి మాట్లాడారు. ఆమె ఎవరో కాదు మన తెలంగాణ మంత్రి కొండా సురేఖ.  

ఇంతకూ ఏమన్నారు...:

Latest Videos

దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో నాలుగో విడతలో అంటే మే 13న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో నోటిఫికేషన్ వెలువడి అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. ఇక మిగిలింది పోలింగ్ మాత్రమే.ఇందుకు మరో పదిరోజుల సమయం వుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ముమ్మర ప్రచారం చేపట్టాయి. ఇలా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షో లు, ప్రచార సభలు, ర్యాలీలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. 

ఇలా ఎన్నికల ప్రచారంలో భాగంగా  సీఎం రేవంత్, మంత్రి కొండా సురేఖ మెదక్ లోక్ సభ పరిధిలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నీల మధుతో కలిసి రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగానే కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక్కొక్కరు పది ఓట్లు వేసయినా సరే నీలం మధును లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు. బిసిలంతా మనలోకే ఒకడైన ముదిరాజ్ బిడ్డ మధును గెలిపించాలని మంత్రి కోరారు. 

10 దొంగ ఓట్లు వేసైనా సరే గెలిపించండి!

ఒక్కొక్కరు 10 ఓట్లు వేసి నీలం మధును గెలిపించాలి - మంత్రి కొండా సురేఖ pic.twitter.com/6VIWMTJYo7

— Telugu Scribe (@TeluguScribe)

 

మంత్రి వ్యాఖ్యలపై దుమారం :

 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో మంత్రి సురేఖ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నారు. 'ఒక్కొక్కరు పది ఓట్లు వేయడం ఏమిటి... అంటే దొంగ ఓట్లు వేయమని చెబుతున్నారా మంత్రి గారు' అని కొందరు ప్రశ్నిస్తున్నారు. 'ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందే స్వయంగా మంత్రి దొంగఓట్లు వేయమంటున్నారు... ఆ పార్టీ అధికారంలో వుంది కాబట్టి అన్నంత పని చేస్తారేమో'  అని ప్రతిపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మంత్రి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు కూడా ఈ వీడియోపై వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం మంత్రి సురేఖ ఏదో ప్లో లో అలా మాట్లాడి వుటుందని.... దొంగ ఓట్లు వేయమనడం ఆమె ఉద్దేశం కాదంటున్నారు. ఓటమి భయంతో వున్న ప్రతిపక్షాలు కావాలనే ఈ వీడియోను, మంత్రి వ్యాఖ్యలపై దుమారం రేపుతున్నాయని కాంగ్రెస్ నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు. 

  


 

click me!