హైదరాబాద్ శివారులో ఓ ఆర్మీ వాహనం ఏడు కార్లను ఢీకొడుతూ బీభత్సం సృష్టించింది.
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) లో ఇండియన్ ఆర్మీ (indian army) వాహనం బీభత్సం సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు కార్లను ఢీకొడుతూ ముందుకెళ్లిన ఆర్మీ వాహనం ఘోర ప్రమాదానికి కారణమయ్యింది. శనివారం సాయంత్రం సమయంలో హైదరాబాద్ శివారులో ఈ యాక్సిడెంట్ జరిగింది.
మేడ్చల్ జిల్లా (medchal district) తూంకుంట సమీపంలోని రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరం నుండి బయటకు వెళుతున్న ఆర్మీ వాహనం అలంకృత రిసార్డ్ వద్దకు రాగానే అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. ఇలా ఏడు కార్లను ఢీకొడుతూ ముందుకెళ్లింది. దీంతో మూడు కార్లు బాగా ధ్వంసమవగా మరో నాలుగు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి.
అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే కొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేసారు.