టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్.. ప్రగతి భవన్‌ ముట్టడికి ఏబీవీపీ యత్నం.. తీవ్ర ఉద్రిక్తత..

By Sumanth KanukulaFirst Published Mar 21, 2023, 12:48 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌కు నిరసనగా ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌కు నిరసనగా ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు. అయితే పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో ఏబీవీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పలువరు ఏబీవీపీ కార్యకర్తలు  పోలీసులను దాటుకుని రోడ్డు మీద పరుగులు తీశారు. ప్రగతి భవన్ గేటుకు సమీపంలో రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేశారు. 

ఈ క్రమంలోనే కొందరు ఏబీవీపీ కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ప్రగతి భవన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఇక, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కార్యకర్తలు కోరుతున్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ  జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా టీఎస్‌పీఎస్సీ పరీక్షలను సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నారు. 
 

click me!