స్వరం మార్చిన కోమటిరెడ్డి: కేటీఆర్ పై పొగడ్తల వర్షం

By Nagaraju penumalaFirst Published Nov 1, 2019, 6:41 PM IST
Highlights

తొలుత మునుగోడు ప్రజల తరపున మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ను నమ్ముతున్నరు కాబట్టే రెండోసారి అధికారం కట్టబెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడ్తయని, మా జీవితాల్లో వెలుగు నింపుతయని ఎంతో ఆశతో కొన్ని లక్షల మంది యువకులు ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. 
 

భువనగిరి: అధికార టీఆర్ఎస్ పార్టీపైనా, కేసీఆర్ కుటుంబంపైనా ఎప్పుడు నిప్పులు చెరిగే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆకస్మాత్తుగా స్వరం మార్చారు. ఎన్నడూ లేని విధంగా మంత్రి కేటీఆర్‌పై ఒక్కసారిగా ప్రశంసల వర్షం కురిపించారు.

కేటీఆర్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండటం మన అదృష్టమంటూ ప్రశంసించారు. యాదాద్రి భువనగిరిలో గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కును మంత్రి కేటీఆర్ తో కలిసి కోమటిరెడ్డి ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేటీఆర్ ను ఒక రేంజ్ లో పొగిడేశారు.  

తొలుత మునుగోడు ప్రజల తరపున మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ను నమ్ముతున్నరు కాబట్టే రెండోసారి అధికారం కట్టబెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడ్తయని, మా జీవితాల్లో వెలుగు నింపుతయని ఎంతో ఆశతో కొన్ని లక్షల మంది యువకులు ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. 

అలాంటి యువకుల కోసం, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేపట్టిన కార్యక్రమమే గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ అని చెప్పుకొచ్చారు. పారిశ్రామిక వేత్తలందరినీ ఈ వేదిక ద్వారా ఆహ్వానం పలికారు.  

కేటీఆర్‌లాంటి అనుభవం, అవగాహన ఉన్న వ్యక్తి పరిశ్రమల శాఖ మంత్రి కావడం మన అదృష్టమని రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక మౌలిక వసతులతో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో పరిశ్రమలు పెట్టేందుకు వస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.
 
దండుమల్కాపూర్‌లో టీఎస్‌ఐఐసీ-టీఐఎఫ్-ఎమ్మెస్‌ఎంఈ-గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు కోసం రైతులు తక్కువ ధరకు భూములిచ్చి పెద్ద మనసు చాటుకున్నారని కొనియాడారు. భూసేకరణ విషయంలో తోడ్పాటునందించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 

ఎన్నడూ లేని విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి కేటీఆర్ తో వేదిక పంచుకోవడం ఒక ఎత్తైతే...అదే వేదికపై ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం మాట్లాడినా సంచలనమే అంటారు. 

తొలిసారిగా మంత్రి కేటీఆర్ తో వేదిక పంచుకోనున్న నేపథ్యంలో ఎలాంటి హాట్ హాట్ కామెంట్స్ చేస్తారోనని అంతా ఆసక్తిగా గమనించారు. అయితే ఎలాంటి విమర్శలు చేయకుండా కేటీఆర్ పైనా, టీఆర్ఎస్ పైనా పొగడ్తలు కురిపించి మరో సంచలనానికి తెరలేపారు.  

ఇకపోతే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్థిక మంత్రి కేటీఆర్ తో భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. 

సుమారు హరీశ్ రావుతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరగంట సేపు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ మార్పుపై చర్చించినట్లు తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరతారంటూ అప్పుడే సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. 

 

ఈ వార్తలు కూడా చదవండి

కారెక్కుతారా...?: మంత్రి హరీశ్ తో ఎమ్మెల్యే కోమటిరెడ్డి భేటీ

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

అసెంబ్లీలో మంత్రి తలసాని, ఎమ్మెల్యే కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం

click me!