ఆమెకు నేనున్నా.. ప్రగతి భవన్ లో మంత్రి ‘కేటీఆర్’ ఎమోషనల్.. రాఖీ కట్టించుకుని భావోద్వేగం..

By Bukka SumabalaFirst Published Sep 20, 2022, 9:33 AM IST
Highlights

ఐటీ మంత్రి కేటీఆర్ ఓ అనాథ విద్యార్థి చదువుకు సహాయం చేశాడు. ఆమె చక్కగా చదువుకుని ఇంజనీరింగ్ పూర్తి చేసింది. క్యాంపర్ రిక్రూట్ మెంట్ లో 4 జాబ్ ఆఫర్స్ సాధించింది. 

హైదరాబాద్ : ఆడపిల్లల చదువు విషయంలో అండగా ఉండేందుకు ఎప్పుడూ ముందుండే కేటీఆర్ మరోమారు తన మంచి మనసు చాటుకున్నారు. ఓ నిరుపేద విద్యార్థిని జీవితాన్ని నిలబెట్టారు. తల్లిదండ్రులు లేని రుద్రరచన అనే ఇంజనీరింగ్ విద్యార్థిని చదువుకు అవసరమైన సహాయం చేసి ఆమె ఇంజనీరింగ్ పూర్తయ్యేలా చేశారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన రుద్ర రచన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. స్థానిక బాలసదన్ లో ఉంటూ జగిత్యాల ప్రభుత్వ బాలికల హైస్కూల్లో పదవ తరగతి వరకు చదివింది.

ఆ తర్వాత హైదరాబాద్ హబ్సిగూడలోని స్టేట్ హోంలో ఉంటూ పాలిటెక్నిక్ పూర్తి చేసింది. ఈసెట్ ప్రవేశపరీక్ష ద్వారా హైదరాబాద్ సిబిఐటి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ లో ఇంజినీరింగ్ సీటు సంపాదించింది. అయితే తల్లిదండ్రులు లేని రుద్ర రచన తన ఇంజనీరింగ్ ఫీజు చెల్లించలేకపోయింది. విద్యా రచన ఆర్థిక ఇబ్బందులను సోషల్ మీడియా ద్వారా 2019లో తెలుసుకున్న కేటీఆర్, ఆమెను ప్రగతి భవన్ కు పిలిపించుకుని ఇంజనీరింగ్ చదువు పూర్తయ్యేందుకు అవసరమైన ఖర్చులను  భరిస్తానని భరోసా ఇచ్చారు. 

లిఫ్ట్ అడిగి ప్రాణం తీశాడు.. పథకం ప్రకారమే హత్యా!?.. పిచ్చికుక్కలను చంపేందుకు వాడే విషంతో ఇంజక్షన్..!!

ఇచ్చిన మాట ప్రకారం రుద్ర రచన ఇంజినీరింగ్ ఫీజులు, హాస్టల్ సంబంధిత ఖర్చులను కేటీఆర్ వ్యక్తిగతంగా భరించారు. కేటీఆర్ ఆర్థిక సహాయంతో ఇంజనీరింగ్ చదువుతున్న రుద్రరచన,  ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్ లో నాలుగు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాన్ని సాధించింది. ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను రుద్ర రచన కలిసింది. ఆమె చదువు, ఉద్యోగాల విషయం తెలుసుకుని కేటీఆర్ సంతోషపడ్డారు.  తనకంటూ ఎవరూ లేకున్నా ఆత్మవిశ్వాసంతో రుద్ర రచన జీవితంలో విజయం సాధించిందని మెచ్చుకున్నారు.

 తల్లిదండ్రులు లేని తనకు మంత్రి కేటీఆర్ ఒక అన్నగా అండగా నిలబడ్డారని, తన కల సాకారం కోసం తండ్రిగా తపించారని.. రచన భావోద్వేగానికి లోనైంది. ఈ సంవత్సరం రాఖీ కట్టాలి అనుకున్నానని.. అయితే కేటీఆర్ కాలికి గాయం అయిందన్న విషయం తెలుసుకొని బాధపడ్డానని రుద్ర రచన తెలిపింది. తాను పొదుపు చేసుకున్న డబ్బులతో వెండి రాఖీ తయారు చేయించానని.. చెప్పిన రచన వాటిని కేటీఆర్కు కట్టింది. రచన మాటలకు, అభిమానానికి మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. రచన చేత రాఖీ కట్టించుకున్న తాను, ఆమె జీవితంలో మరింత స్థిరపడేందుకు చేసే ప్రతి ప్రయత్నానికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 

జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొని వాటిని సవాలుగా స్వీకరించి నాలుగు కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన రచన యువతరానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి సివిల్ సర్వెంట్ కావాలన్న తన లక్ష్యానికి అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. రచన చివరి సంవత్సరం ఇంజనీరింగ్ ఫీజు, హాస్టల్ బకాయిలు మొత్తం నగదు సహాయాన్ని కేటీఆర్ అందించారు. 

click me!