
సిట్ అధికారులు సరికొత్త వాదన తెరమీదకు తెచ్చారు. దీంతో సినీ వర్గాల్లోని డ్రగ్ బాధిత తారలకు ఆందోళన మొదలైంది. టాలీవుడ్ నటులను డ్రగ్ కేసులో సిట్ గత వారం రోజులుగా విచారిస్తున్నది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు సిట్ ముందుకొచ్చారు. అయితే సిట్ విచారణకు చార్మి ఎదురుతిరిగింది. సిట్ అధికారులు విచారణ సమయంలో అనుసరిస్తున్న పద్ధతులు సరిగాలేవని హై కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. చార్మి పిటిషన్ పై హైకోర్టులో వాదనలు విన్న తరువాత న్యాయస్థానం కొన్ని ఆదేశాలను జారీ చేసింది. చార్మి విచారణ సమయంలో మహిళా అధికారి ఉండాలని, తన అనుమతి లేకుండా బ్లడ్, వెంట్రుకలు, గోర్ల శాంపుల్స్ తీసుకోరాదని, కేవలం తన లాయర్ సమక్షంలో మాత్రమే విచారించాలని అభ్యర్థించింది. అలాగే ఉదయం 10 గంటల నుండి సాయంత్ర 5 గంటల వరకు మాత్రమే విచారణ చేపట్టాలని కోరింది. ఆమె వాదనలు విన్న హైకోర్టు ఆమెకు అనుకూలంగా ఆదేశాలను జారీ చేసింది.
మంగళవారం చార్మీ పిటిషన్పై కోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం ప్రభుత్వ లాయర్ మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్న చార్మి విచారణ నిమిత్తం సిట్ కార్యాలయానికే వస్తానని చెప్పారని, మళ్లీ మాటమార్చడానికి వీల్లేదని ఆమెకు సూచాంమన్నారు. సిట్ టీం ముందు విచారణకు హాజరైన వారి అంగీకారంతోనే రక్తనమూనాలు తీసుకున్నామని, నిన్న నవదీప్ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి అంగీకరించలేదని చెప్పారు. శాంపిల్స్ తీసుకునేందుకు అంగీకరించకపోతే విచారణకు సహకరించలేదని భావించాల్సి వస్తుందన్నారు. సో మొత్తానికి తప్పు చేయకపోయినా, డ్రగ్స్ తీసుకోకపోయినా శాంపుల్స్ ఇస్తే తప్పేంటన్నది సర్కారు లాయర్ వాదన. ఆయన వాదనలోనూ లాజిక్ ఉంది కదా????