Telangana: పార్లమెంట్లో మోడీ వ్యాఖ్యల నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ర్యాలీలు జనగామలో హింసకు దారీ తీశాయి. ఈ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించడానికి గురువారం జనగామ వెళ్లాలనుకున్న బీజేపీ నేత ఈటల రాజేందర్ ను హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. రాష్ట్రంలో ధర్నాలు చేయడానికి తెరాసాకే అనుమతులా? ఇదేనా ప్రజాస్వామ్యం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana: తెలంగాణలో రాజకీయాలు వేడేక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష బీజేపీ, అధికార టీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ వైరం ముదురుతోంది. పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీఆర్ఎస్ (TRS) కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, నిరసనలకు దిగారు. తెరాసాకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు సైతం ఆందోళనలు చేపట్టారు. అయితే, ఈ ర్యాలీలు జనగామలో హింసకు దారీ తీశాయి. ఈ ఘటనలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించడానికి గురువారం జనగామ వెళ్లాలనుకున్న బీజేపీ (bjp) నేత ఈటల రాజేందర్ (etela rajender)ను హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. రాష్ట్రంలో ధర్నాలు చేయడానికి తెరాసాకే అనుమతులా? ఇదేనా ప్రజాస్వామ్యం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ధర్నాలు చేయడానికి ఒక్క అధికార తెరాసా (TRS) పార్టీకి మాత్రమే అనుమతులు ఉంటాయా? అని ప్రశ్నించారు. అధికార పార్టీ కార్యకర్తలు దాడులు చేయవచ్చు.. ఆ దాడులు కొనసాగుతుంటే పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. పైగా దెబ్బలు తిన్నవారిమీదనే పోలీసులు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. కనీసం గాయపడిన వారికి ధైర్యం చెప్పే స్వేచ్ఛ కూడా లేదా? అంటూ ప్రశ్నించారు. ఇదేక్కడి ప్రజాస్వామ్యం అని గళమెత్తారు. టీచర్ల ధర్నా చేస్తే వాళ్ళని గొడ్డులు బాదినట్టు బాదారు.. కానీ తెరాసా వాళ్లకేమో పోలీసులు బందోబస్తు ఇచ్చారు అని ఈటల రాజేందర్ (etela rajender) ఆరోపించారు.
ఒక్క తెరాసాకేనా.. ప్రజాసంఘాలు, ఇతర పార్టీలకు మాట్లాడే అధికారం, నిరసన చెప్పే అధికారం లేదా ? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల గొంతుకను అణచివేస్తున్నదని ఆరోపించారు. తెలంగాణలో పౌరులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని అన్నారు. బీజేపీ (bjp) మద్దతు లోనే తెలంగాణ వచ్చిందనీ, పార్లమెంట్లోనూ ప్రధాని మోడీ ఇదే విషయాలు ప్రస్తావించారని పేర్కొంటూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. బీజేపీ అండతోనే తెలంగాణ వచ్చింది.. అలాంటి తెలంగాణలో నేడు.. కుటుంబ పాలన కొనసాగుతున్నదని అన్నారు.
మరీ ముఖ్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. వారి చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారి మీద వేధింపులు, ఆశ్రిత పక్షపాతం చూపుతున్నారని ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ బంధు ప్రీతి, అధికార దుర్వినియోగంతో ముందుకు సాగుతున్నదని తెలిపారు. ధరణి పేరిట లక్షల ఎకరాలు మాయం చేశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలు మర్చిపోయిందని అన్నారు. ఉద్యోగులపై వేధింపులు.. ఉపాధి కరువై నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ, ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. పెన్షన్ లు అందరికీ అందడం లేదనీ, మధ్యాహ్న భోజనం వండే వారికి జీతాలు ఇవ్వడం లేదని అన్నారు. ప్రజల కష్టాలు, వారి బాధలను తీర్చాల్సిన సర్కారు... మంత్రులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. స్వయంగా రాష్ట్ర హోం మంత్రి ప్రధాని దిష్టి బొమ్మ తగలపెట్టడంతెలంగాణ పాలన దుస్థితికి అద్దం పడుతున్నదని etela rajender విమర్శించారు.