ఎంపీ అర్వింద్ చేతనైతే అభివృద్ధిలో పోటీ పడు.. అంతేకానీ, ఫేస్బుక్లలో తిట్లపురాణం, అర్దరహిత విమర్శలు మానుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు. కేసీఆర్ నాయకత్వంలో పల్లెలు ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నాయని వివరించారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పల్లెలు ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై అవాస్తవ, అర్దరహిత విమర్శలు మానుకోవాలని, చేతనైతే తమతో అభివృద్దిలో పోటీ పడాలని ఇతర పార్టీల ప్రతినిధులకు హితవు పలికారు. బాల్కొండ నియోజకవర్గంలో కోట్ల రూపాయలు విలవు చేసే అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రూ. 2 కోట్లతో ముప్కాల్ నుంచి ఎస్సారెస్పీ పంపు వరకు చేపడుతున్న బీటీ రోడ్డ డబుల్ నెలన్ నిర్మాణ పనులు సహా పలు ఇతర ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అర్వింద్ పై విమర్శలు సంధించారు. అర్దరహిత విమర్శలు మాని అభివృద్ధిలో పోటీ పడు అని హితవు పలికారు. ఫేస్బుక్ తిట్లలో కాదు.. ఆడవారిపై నోరుపారేసుకోవడం కాదు చేతనైతే అభివృద్ధి చేయాలని అన్నారు.
సీఎం కేసీఆర్ పల్లెపల్లెన అభివృద్ధి జరిపిస్తున్నాడని, బాల్కొండ సెగ్మెంట్లో చేసిన అభివృద్ది కార్యక్రమాలే ఇందుకు నిదర్శనం అని అన్నారు. ఇకపై కూడా ఇదే విధంగా ప్రతి వారం కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపడుతామని హామీ ఇచ్చారు.
Also Read: మునుగోడులో చావుడప్పుతో టీఆర్ఎస్ శవయాత్ర ... బిజెపి దిష్టిబొమ్మ దహనం
ఇలా తాము అభివృద్ధి పనుల్లో మునిగితే.. కొందరు మాత్రం అసత్య ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో దృష్టి మరలుస్తున్నారని పేర్కొన్నారు. ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదని తెలిపారు. ఇప్పటికైనా అభివృద్ధి పనిలో ఉంటే ప్రజలు గుర్తిస్తారని వివరించారు.
ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తా అని హామీ ఇచ్చిన ఎంపీ ఇంకా ఎందుకు తేలేదని నిలదీశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. కాబట్టి, కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ కోట్ల నిధులు ఇస్తూనే ఉన్నది. మీరు కూడా చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని చాలెంజ్ చేశారు. అంతేకానీ, తిట్ల పురాణాలకు దిగడం, ఆడబిడ్డలను అవమానించేలా మాట్లాడే కుసంస్కారం సరికాదని అన్నారు. తమకు అది చేత కాదని, అభివృద్ధే తమ ఎజెండా అని అన్నారు.