బీఆర్ఎస్‌లో టికెట్ల పంచాయతీ.. ఎవరికివ్వాలో నాకు తెలుసు, తగాదాలొద్దు : నేతలకు కేసీఆర్ క్లాస్

By Siva KodatiFirst Published Apr 27, 2023, 7:31 PM IST
Highlights

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల పంచాయతీపై ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ శ్రేణులకు క్లాస్ పీకారు. టికెట్లు ఎవరికి ఇవ్వాలో తనకు తెలుసునని సీఎం స్పష్టం చేశారు. 

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల పంచాయతీపై ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ శ్రేణులకు క్లాస్ పీకారు. తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల్లో టికెట్ల పంచాయతీ ఎందుకు వస్తోందని కేసీఆర్ ప్రశ్నించారు. టికెట్లు ఎవరికి ఇవ్వాలో తనకు తెలుసునని సీఎం స్పష్టం చేశారు. టికెట్ల పంచాయతీ మొదలైతే జనాల్లోకి వేరే మెసేజ్ వెళ్తుందన్నారు.

ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా ప్రజల్లోనే వుండాలని కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలో గ్రూప్ తగాదాలను పరిష్కరించే బాధ్యత మంత్రులదేనన్నారు. ఆగస్ట్ లోపు అన్ని పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. అలాగే మే లో పోడు భూముల పంపిణీ నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ మనకు పోటీ కాదని కేసీఆర్ పేర్కొన్నారు. 

Latest Videos

ఇకపోతే.. దళిత బంధు కార్యక్రమం అమలులో అక్రమాలు చోటు చేసుకోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. దళితబంధు పథకం విషయంలో కొందరు ఎమ్మెల్యేలు వసూళ్లకు పాల్పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రూ.3 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపించారు. వసూళ్లకు పాల్పడ్డ ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద వుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఇది తన చివరి వార్నింగ్ అని.. మళ్లీ వసూళ్లకు పాల్పడితే టికెట్ దక్కదని, పార్టీ నుంచి వెళ్లిపోవడమేనని ముఖ్యమంత్రి హెచ్చరించారు. మీ అనుచరులు తీసుకున్నా మీదే బాధ్యతని ఆయన హెచ్చరించారు. 

ALso Read: దళితబంధులో చేతివాటం.. ఎవరెంత తీసుకున్నారో చిట్టా వుంది , ఇదే లాస్ట్ వార్నింగ్ : ఎమ్మెల్యేలకు కేసీఆర్ క్లాస్

అంతకుముందు కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాల వారీగా ఇద్దరు ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం అవ్వాలని.. కేడర్‌తో అసంతృప్తి తగ్గించే చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు రావడమే మనకు ముఖ్యమని కేసీఆర్ అన్నారు. 

అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానెల్‌ను కూడా నడపవచ్చని సీఎం సూచించారు. పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట జెడ్పీ ఛైర్మన్లు, ఎంపీలను ఇన్‌ఛార్జీలుగా నియమిస్తామన్నారు. మూడు, నాలుగు నెలల్లో ఇన్‌ఛార్జీల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దాహం వేసినప్పుడే బావి తవ్వుతామనే రాజకీయం నేటి కాలానికి సరిపోదన్నారు. మళ్లీ అధికారంలోకి రావడం పెద్ద టాస్క్ కాదన్న ఆయన.. గత ఎన్నికల్లో కంటే ఎన్ని ఎక్కువ సీట్లు వచ్చాయన్నదే ముఖ్యమన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలని.. జాగ్రత్తగా లేకుంటే మీకే ఇబ్బందని, తాను చేసేదేం లేదని కేసీఆర్ హెచ్చరించారు. 
 

click me!