- ప్రైవేటు టెలికాం సంస్థలపై బీజేపీ నేత కిషన్ రెడ్డి ఫైర్
- హైదరాబాద్ రోడ్లను నాశనం చేస్తున్నాయని ధ్వజం
హైదరాబాద్ రోడ్లు ఇంత అధ్వాన్నంగా ఉండటానికి కారణమేంటో బీజేపీ నేత కిషన్ రెడ్డి కనిపెట్టేశారు. ఎయిర్టెల్, రిలయన్స్ సంస్థల వల్లే రాజధాని రోడ్లు పాడవుతున్నాయని తేల్చిచెప్పారు. కేబుల్వైర్ల ఏర్పాటుకోసం ఆ సంస్థలు ఇంతకు ముందు తవ్వినచోట్ల మరమ్మతులు చేయకపోవడం వల్లే రోడ్లు దారుణంగా పాడవుతున్నాయని ఆరోపించారు.
శాసనసభలో మంగళవారం హైదరాబాద్పై చర్చ సందర్భంగా ఆయన రోడ్ల తవ్వకాలు, నాలాల్లో పూడిక తీత తదితర సమస్యలను ప్రస్తావించారు.
‘నా నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులను కలిసినా ఫలితం కనిపించడం లేదు. విశ్వనగరం విషయం పక్కన పెట్టి ప్రభుత్వం ముందు రోడ్ల సంగతి చూడాలి’ అని డిమాండ్ చేశారు.