కారణమిదీ: రేపు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

By narsimha lodeFirst Published Dec 15, 2022, 12:05 PM IST
Highlights

రేపు  ఉదయం  11 గంటలకు ప్రధాని మోడీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బేటీ కానున్నారు.  భువనగిరి నియోజకవర్గంలో అభివృద్ది పనుల విషయమై చర్చించనున్నారు. 

హైదరాబాద్:   భువనగిరి ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఈ నెల 16న   ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు.  తన పార్లమెంట్ నియోజకవర్గంలో  అభివృద్ది పనుల విషయమై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్చించనున్నారు.మూసీ నదీ ప్రక్షాళనతో పాటు  విజయవాడ-హైద్రాబాద్  జాతీయ రహదారి విస్తరణ పనుల విషయమై కూడా ప్రధానితో  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్చించనున్నారు.  ఎంఎంటీసీ, మెట్రో రైలు పనులపై కూడ  వెంకట్ రెడ్డి  చర్చించనున్నారు. ఎఐసీసీ  చీఫ్  మల్లికార్జున ఖర్గేతో  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్ననే న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.  రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై చర్చించారు. మరోవైపు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కూడా  కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి  చర్చించారు. ఎన్నికలకు నెల రోజుల ముందే తాను రాజకీయాల గురించి మాట్లాడుతానని  మూడు రోజుల క్రితం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. తాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో  ఉన్నట్టుగా  చెప్పారు.

ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు  రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన సోదరుడు  కాంగ్రెస్ పార్టీని వీడినా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.  ఇటీవల జరిగిన మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా  పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.  ఈ ఎన్నికల్లో  రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడినట్టుగా  ఉన్న ఆడియో సంభాషణ  వైరల్ గా మారింది.

also read:ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కోమటిరెడ్డి భేటీ: పార్టీ పరిస్థితులపై చర్చ

మునుగోడు ఉప ఎన్నికల్లో  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపు ప్రచారానికి వెళ్లలేదు. ఎన్నికలు జరిగే సమయంలో అస్ట్రేలియా పర్యటనకు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లారు.  ఈ సమయంలో  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.  మునుగోడులో  కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని  వెంకట్ రెడ్డి  చెప్పారు. ఈ వ్యాఖ్యలపై  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి  కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం  షోకాజ్ నోటీసులు జారీ చేసింది.  ఈ నోటీసుకు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం ఇచ్చారు.  ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా  ఉంటున్నారు. 

click me!