
చైనా వాళ్లేది చేసినా వింతే. చాలా విషయాల్లో వాళ్లు ముందున్నారు. నెంబర్ వన్ అనిపించుకుంటారు. పే... ద్ద డ్యాంలు, ఏ...త్తయిన రైల్వే లైన్లు ఒకటేమిటీ ఈ మధ్య కాలంలో ఏది తీసుకున్నా వాళ్లే నెంబర్ వన్. ఇపుడు ప్రపంచంలో ఎత్తయిన బ్రిడ్జి కట్టినెంబర్ వన్ అనిపించుకున్నారు.
శుక్రవారం నాడు ట్రాఫిక్ కు అంకితం చేసిన ఈ బ్రిడ్జిని యూనాన్,గిజో రాష్ట్రాలను కలుపుతూ ఒక నది మీద నిర్మించారు.దీనితో కొండల చుట్టూ తిరుగుతూ వెళ్లాల్సిన పని లేకుండా ఇపుడు నదిమీద నిర్మించిన ఈ వంతెన మీది నుంచి తొందరగ రెండు రాష్ట్రాల ప్రజలు గమ్యాలను చేరుకోవచ్చు. దీని వల్ల ప్రయాణ కాలం మూడింతలు తగ్గుతుంది.
బీపెయిజియాంగ్ అని పేరున్న ఈ వంతెన ఎత్తు 565 మీటర్లు (1854 అడుగులు). 1341 మీటర్ల పొడవయిన ఈ వంతెన నిర్మాణానికి 144 మిలియన్ అమెరికా డాలర్లు ఖర్చయ్యాయట.గతంలో చైనాలోనే నిర్మించిన ప్రపంచం లోనే ఎత్తయిన వంతెన రికార్డును ఇది బద్దలుకొట్టింది. గతంలో మధ్య చైనా రాష్ట్రం హుబెయి లో సి డు నది మీద నిర్మించిన గత వంతెన ప్రపంచంలో ఎత్తయినదిగా ఉండింది.
విశేషమేమిటంటే ప్రపంచలోని ఎత్తయిన వంతెలన్నీ చైనాలోనే ఉన్నాయి.
ఫ్రాన్స్ లో మిలావ్ వయాడక్ట్ ఎత్తయినదే అయినా బ్రిడ్జి ఎత్తుంటుంది తప్ప, భూమి ఏ మంత ఎత్తులో ఉండదు.