
గోల్డ్ స్టోన్ ప్రసాద్ భూమిల్ని టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు కొన్నారని ఈ రోజు మీడియాలో వార్త గుప్పుమంది.
ఫోర్జరీలతో, తప్పుడు డాక్యమెంట్లలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ మియాపూర్ ప్రాంతంలో భారీగా ప్రభుత్వం భూములను రిజిస్ట్రేషన్ చెయించుకున్న కుంభకోణం హైదరాబాద్ ను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. గోల్డ్ స్టోన్ ప్రసాద్ అనేక ప్రముఖ తెలుగు రాజకీయ నాయకులకు మిత్రుడు. ఢిల్లీ మోతీ బాగ్ లోని ఆయన గెస్ట్ హౌస్ లో చాలా మంది తెలుగు నేతలు విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. చాలా మంది తెలుగునేతలను డిల్లీ కాంగ్రెస్ నేతలకు సన్నిహితం చేసిందాయనే. అందువల్ల ఆయన వల్ల చాలా మంది తెలుగు నేతలు లబ్ది పొంది ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నపుడు ఆంధ్రజ్యోతి దినపత్రిక కె కెశవరావు సంగతి వెల్లడించింది.
‘‘రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో దొంగ జీపీఏల ద్వారా కబ్జా చేసిన ప్రభుత్వ, అటవీ భూముల్లో 38 ఎకరాలను కేకే కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేసింది. దండు మైలారం పంచాయతీ హఫీజ్పూర్ రెవెన్యూ పరిధిలో ఈ భూములు ఉన్నాయి. కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి, కోడలు జ్యోత్న(విప్లవ్ కుమార్ భార్య), కంచర్ల నవజ్యోతిలకు గోల్స్టోన్ కంపెనీ ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసింది. రిజిస్ర్టేషన్ పత్రం ప్రకారం మొత్తం 50 ఎకరాల భూమిని రిజిస్టర్ చేయగా, అందులో 38 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందంటున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో పదికోట్లకు పైనే.‘‘ అని ఆంధ్రజ్యోతి పేర్కొంది.
కెకె వివరణ
ఇబ్రహీంపట్నంలో 2013లో తాను భూములు కొన్నది నిజమేనని, అయితే అవి వివాదాస్పద భూములు కాదని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు వివరణ ఇచ్చారు. శనివారం ఆయన ఈ విషయం బ్రేక్ చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు “నేను కొన్నది ప్రభుత్వ భూమి కాదని సీసీఎల్ఏ స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతోనే భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. నేను కొన్న భూమి రిజిస్ట్రేషన్ చేయాలని కలెక్టర్ ఉత్తర్వులున్నాయి. కలెక్టర్ ఉత్తర్వులు తప్పయితే కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశముంటుంది,’’ అని ఆయన చెప్పారు.