NEWS
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న పాదయాత్రకు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అనుమతి తీసుకున్నారా అని అడగడమే విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.
చంద్రబాబు గతంలో చేపట్టిన పాదయాత్రకు అనుమతి తీసుకున్నారా అంటూ ప్రశ్నించారు. అలాంటప్పుడు జగన్ మాత్రం ఎందుకు అనుమతి తీసుకోవాలని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టేందుకే జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారన్నారు. ప్రజా సంకల్ప యాత్ర ప్రకటించగానే ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిందన్నారు.
యాత్రకు అనుమతి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే పాదయాత్రకు సంబంధించిన సమాచారాన్ని డీజీపీకి అందజేశామన్నారు. ప్రభుత్వం యాత్రను అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రలు ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. ఆటంకాలు లేకుండా భద్రతా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నందునే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.