
వైసీపీ అధినేత జగన్ మాటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ప్యారడైజ్ పేపర్ల విషయంలో జగన్ చంద్రబాబుకి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ సవాల్ కి మంత్రి గంటా గురువారం స్పందించారు.
జగన్ సవాలు విసరాల్సింది చంద్రబాబుకి కాదని.. ప్యారడైజ్ పేపర్లు, సీబీఐ, ఈడీలకని ఎద్దేవా చేశారు. భారతదేశంలో ఎక్కడ అవినీతి జరిగినా జగన్ పేరు ప్రస్తావన తప్పకుండా వస్తుందన్నారు. జగన్ ది ప్రజా సంకల్ప యాత్ర కాదని, బ్రేకింగ్ పాదయాత్ర అంటూ విమర్శించారు. బ్రేకులు తీసుకుంటూ పాదయాత్ర ఇప్పటి వరకు ఎవరూ చేయలేదని.. ఆ ఘనత జగన్ దేనంటూ ఎద్దేవా చేశారు. కోర్టులో హాజరుకావడానికి జగన్ పాదయాత్రకు బ్రేకులు వేస్తారన్నారు.
రాష్ట్రానికి చంద్రబాబు సమర్థవంతమైన, ఆదర్శవంతమైన పాలనను అందిస్తున్నారన్నారు. సీఎం కుర్చీ కోసం జగన్ తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. గతంలోనూ జగన్ చంద్రబాబుపై దారుణమైన ఆరోపణలే చేశారని గుర్తు చేశారు.
ప్రజాస్వామ్యాన్ని జగన్ అపహాస్యం చేస్తున్నాడని.. పాదయాత్ర పేరుతో అసెంబ్లీని బాయ్ కాట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఉన్నదే.. ప్రజా సమస్యలపై చర్చించడానికి అన్న విషయం మర్చిపోవద్దని హితవు పలికారు. జగన్ తీరుతో సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారన్నారు. ‘ఆపరేషన్ ఆకర్ష’ పేరుతో ఎంతోమంది ఎమ్మెల్యేలను వైఎస్ కాంగ్రెస్ లో చేర్చుకున్నారని గుర్తు చేశారు. అప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు.
ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతలు చేరడం అనేది కొత్తగా పుట్టుకొచ్చిన విషయం కాదన్నారు. పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నిర్ణయం తీసుకునే హక్కు స్పీకర్ కే ఉంటుందన్నారు.