యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా పై ప్రశ్నల వర్షం..రంగంలోకి ఎన్‌ఐఏ!

Published : May 20, 2025, 02:06 PM IST
Jyoti Malhotra_Pak Spy

సారాంశం

పాకిస్థాన్‌కు సమాచారం చేరవేశారన్న ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు, విదేశీ ప్రయాణాలపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

పాకిస్థాన్‌కు చెందిన గూఢచారుల కోసం పనిచేస్తున్నారన్న ఆరోపణలపై హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు మల్హోత్రాను విస్తృతంగా విచారిస్తున్నారు. ఆమె గతంలో చేసిన విదేశీ పర్యటనలు దర్యాప్తులో కీలకాంశంగా మారాయి.

జ్యోతి 2018లో పాస్‌పోర్ట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆమె పాకిస్థాన్, చైనా, దుబాయ్, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, ఇండోనేసియా దేశాలలో పర్యటించింది. ఈ ప్రయాణాల వెనుక ఉద్దేశం ఏమిటో తెలుసుకునేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అన్ని ప్రయాణాలపై పూర్తి సమాచారాన్ని వెల్లడించాలంటూ ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు.

హిస్సార్ జిల్లాలో ఆమెను విచారించేందుకు ఎన్‌ఐఏ బృందం ప్రత్యేకంగా హాజరైంది. ఉన్నతాధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, ఈ కేసును ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించే అవకాశాలపై కేంద్ర హోంశాఖ ఆలోచిస్తోంది. పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు సోషల్ మీడియా వేదికల ద్వారా సమాచారం సేకరించేందుకు యూట్యూబర్లను వినియోగిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇటీవల రెండు వారాల వ్యవధిలో దేశవ్యాప్తంగా మొత్తం 12 మందిని ఈ కేసులో అరెస్టు చేశారు. వీరిలో పంజాబ్‌లో ఆరుగురు, హరియాణాలో ఐదుగురు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు ఉన్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈ అరెస్టులు కొనసాగుతున్నాయి.అధికారిక వర్గాల ప్రకారం, అరెస్టైన వ్యక్తులు పాక్‌కు సున్నితమైన సమాచారాన్ని అందజేస్తున్నట్టు ఇప్పటివరకు దర్యాప్తులో తేలింది. అంతేకాదు, ఈ నెట్వర్క్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జ్యోతి మల్హోత్రాకు పాక్-అఫ్గాన్ సరిహద్దు ప్రాంతాల్లో సంబంధాలున్నట్లు ఆధారాలు లభించాయి.

 ఆ ప్రాంతం ఉగ్రవాద కార్యకలాపాలకు పేరుగాంచిందిగా అధికారులు తెలిపారు.నిందితుల ఆర్థిక లావాదేవీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, సోషల్ మీడియా కార్యకలాపాలపై ప్రత్యేకంగా ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతోంది. ఈ దర్యాప్తు నేపథ్యంగా భారత్‌లోని గూఢచారి ముఠాలపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ram Mohan Naidu Speech | Tuticorin Airport Renamed as Thoothukudi Airport | Asianet News Telugu
Rammohan Naidu Launches Amazon Air First Cargo Flight from Delhi to Guwahati | Asianet News Telugu