
ముంబయి: మహారాష్ట్ర నుంచి మహిళలు అదృశ్యమవుతున్నారని, వారిని గాలించడానికి ప్రత్యేకంగా కమిటీ వేయాలని మహారాష్ట్ర మహిళా కమిషన్ (ఎంఎస్సీడబ్ల్యూ) చైర్పర్సన్ రూపాలీ చకంకార్ రాష్ట్ర హోం శాఖకు సూచించారు. ప్రతి 15 రోజులకు ఒక సారి ఈ విషయంపై రిపోర్ట్ సమర్పించాలని కోరారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు మహారాష్ట్ర నుంచి 3,594 మహిళలు అదృశ్యమయ్యారని వివరించారు. అందులో కొంత మంది మహిళలను ట్రేస్ చేశామని తెలిపారు. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అని సోమవారం తెలిపారు.
ఈ విషయమై మహారాష్ట్ర స్టేట కమిషన్ ఫర్ వుమన్ చైర్పర్సన్ సోమవారం స్పెషల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (విమెన్ అండ్ చైల్డ్ క్రైమ్ ప్రివెన్షన్) దీపక్ పాండే, రాష్ట్ర హోం శాఖ అసిస్టెంట్ సెక్రెటరీ రాహుల్ కలకర్ణి, ఎంఎస్సీడబ్ల్యూ డిప్యూటీ చైర్పర్సన్ దీపా ఠాకూర్, న్యాయ నిపుణులు వీరేంద్ర నీవ్లతో సమావేశం అయ్యారు. అనంతరం ఎంఎస్సీడబ్ల్యూ చైర్పర్సన్ రూపాలి చకంకార్ మీడియాతో మాట్లాడారు.
మహారాష్ట్ర నుంచి మహిళలు అదృశ్యమవుతున్నారని, వారిని వెతికి పట్టుకోవడానికి సెర్చ్ కమిటీని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర హోం శాఖను ఆమె కోరారు. ప్రతి 15 రోజులకు ఒక సారి తమకు అప్డేట్ ఇవ్వాలని తెలిపారు. ముంబయిలోని సాకినాక ఏరియాకు చెందిన ఇద్దరు ఏజెంట్లు మహిళలను ప్రలోభ పెట్టి బయటి దేశాలకు పంపుతున్నారని ఆమె పేర్కొన్నారు. వారిపై కేసు నమోదైందని తెలిపారు. అయితే, ఈ మాఫియా పెద్దదిగా ఉన్నట్టు ఆమె ఆరోపించారు.
భరోసా సెల్, మిస్సింగ్ సెల్లు కేవలం కాగితాల మీదనే క్రియాశీలకంగా ఉన్నాయని, వాస్తవంలో అవి చేసే పనులేవీ లేవని ఆరోపణలు చేశారు. ఇది చాలా సీరియస్ విషయమని, మిస్ అయిన మహిళల్లో చాలా మంది 16 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వారే ఉన్నారని తెలిపారు.
మిస్ అయిన మహిళలను వెంటనే ట్రాక్ చేయనప్పుడు వారు మధ్య ఆసియా దేశాల్లో లభించారని ఆమె తెలిపారు. పూణె, పింప్రి చించ్వాడ్ ఏరియాలో 82 కుటుంబాలకు చెందిన మహిళలు అబ్రాడ్ వెళ్లారని, వారి ఆచూకీ ఇప్పుడు లభించడం లేదని పేర్కొన్నారు. వారిని కాంటాక్ట్ అయ్యే దారులే లేవని వివరించారు.