Today's Top Stories: ముగిసిన మేడారం మహా జాతర.. టీడీపీ-జనసేన తొలి జాబితా విడుదల..  ప్రధాని మోడీకి తగ్గని క్రేజ్

By Rajesh KarampooriFirst Published Feb 25, 2024, 7:06 AM IST
Highlights

Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ న్యూస్ లో  టీడీపీ-జనసేన తొలి జాబితా విడుదల..  , పవన్ పై సజ్జల సెటైర్లు, GO 317 సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ ! , వైఎస్ షర్మిల తనయుడి రిసెప్షన్ కు హాజరైన అగ్రనేతలు.. కనిపించని జగన్.. , ఉత్కంఠ మ్యాచ్‌లో.. యూపీ వారియర్స్ పై ఆర్సీబీ ఘనవిజయం..   పొత్తులపై అధిష్టానానిదే తుది నిర్ణయం- జీవీకే,    ప్రశాంతంగా ముగిసిన మేడారం మహా జాతర, వీఐపీల డ్రైవర్స్‌కు ఫిట్‌నెస్ టెస్టులు , ధరణిపై రేవంత్ రివ్యూ, జూలై 1 నుండి అమలులోకి కొత్త క్రిమినల్ చట్టాలు, ప్రధాని మోడీకి తగ్గని క్రేజ్..  వంటి వార్తల సమాహారం. 

Today's Top Stories: 

( నోట్- పూర్తి కథనం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి)

టీడీపీ-జనసేన తొలి జాబితా విడుదల..  
 
టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా  శనివారం నాడు  తొలి జాబితాను ప్రకటించింది.  తొలి జాబితాలో  23 మంది కొత్తవారికి అవకాశం కల్పించింది తెలుగు దేశంపార్టీ. 94 స్థానాల్లో  టీడీపీ, 24 స్థానాల్లో  జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నట్టుగా  నేతలు చెప్పారు. తెలుగుదేశం-జనసేన కూటమి ప్రకటించిన తొలి జాబితాలో  మహిళలు, విద్యావంతులు, యువతకు ప్రాధాన్యత ఇచ్చింది. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.  

పవన్ పై సజ్జల సెటైర్లు


తెలుగుదేశం, జనసేన తొలి జాబితాపై  వైఎస్ఆర్‌సీపీ విమర్శలు గుప్పించింది. రాజకీయ పార్టీని ఎలా నడపాలనే స్పృహ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేదని  తొలి జాబితా విడుదలతో స్పష్టమైందని  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శనివారంనాడు తెలుగుదేశం, జనసేన పార్టీలు  తొలి జాబితాను విడుదల చేశాయి. ఈ జాబితాపై  సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు.  అభ్యర్థుల ప్రకటనలో పవన్ కళ్యాణ్ ను చూస్తే దయనీయంగా ఉందని ఆయన సెటైర్లు వేశారు. చంద్ర బాబు ఎన్ని సీట్లిస్తే  అన్ని సీట్లే పవన్ కళ్యాణ్ తీసుకున్నారని ఆయన విమర్శించారు. 

పొత్తులపై అధిష్టానానిదే తుది నిర్ణయం 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై ఎలా వెళ్ళాలనే  అని కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని  బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు.శనివారం నాడు  బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడారు. రాబోయే‌ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలపై  ఎన్నికల కమిటీలో చర్చించనున్నట్టుగా  ఆయన చెప్పారు. ఈ నెల 27 న  కేంద్ర రక్షణ‌మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఏపిలో పర్యటించబోతున్నారన్నారు. పార్లమెంట్ క్లస్టర్ లతో వరుస సమావేశాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. విశాఖలో మేధావులతో సమావేశం వుంటుందని ఆయన తెలిపారు.విజయవాడ లో ఐదు పార్లమెంట్ కోర్‌కమిటీ నేతలతో సమావేశం నిర్వహిస్తామని  జీవీఎల్ నరసింహారావు తెలిపారు.  అనంతరం గోదావరి క్లస్టర్ల సమావేశం లో రాజ్‌నాధ్ సింగ్ పాల్గొంటారని జీవీఎల్ వివరించారు. రాష్ట్రంలో   బిజెపి వ్యవహారాలను జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని  ఆయన చెప్పారు. 

 ప్రశాంతంగా ముగిసిన మేడారం మహా జాతర
 
Medaram Jatara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర నాలుగు రోజుల పాటు కన్నుల పండువగా సాగింది. రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే  మేడారం మహా జాతర శనివారంతో ముగిసింది. ఫిబ్రవరి 21 నుంచి జరుగుతున్న ఈ జాతర.. సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల వన ప్రవేశంతో పరిసమాప్తమైంది. డారం గద్దెపై నుంచి చిలకలగుట్టకు సమ్మక్క చేరుకోగా.. కన్నెపల్లికి సారలమ్మను, పూనుగొండ్లకు పగిడిద్దరాజును, కొండాయికి గోవిందరాజులను తీసుకెళ్లారు. భక్తులు జయజయ ధ్వానాలు చేస్తూ అమ్మవార్లకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ జాతరకు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఇంఛార్జీలుగా బాధ్యతలు నిర్వర్తించారు.

GO 317 సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ !  

GO 317 : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జీవో 317 పై తలెత్తినటువంటి ఉద్యోగుల అభ్యంతరాలు, వివాదాలన్నింటిని కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకు ఓ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పడింది. ఇందులో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చైర్మన్ గా, మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కమిటీల సభ్యులుగా ఓ సబ్ కమిటీ ఏర్పాటు అయింది. 

 వీఐపీల డ్రైవర్స్‌కు ఫిట్‌నెస్ టెస్టులు 

Ponnam Prabhakar:  ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై శుక్రవారం కారు ఢీకొని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జి. లాస్య నందిత మృతి చెందిన నేపథ్యంలో తమ డ్రైవర్లను డ్రైవింగ్‌ టెస్ట్‌కు పంపాలని మంత్రులు, శాసనసభ్యులు, ఐపీఎస్‌, ఐఏఎస్‌ల ఉన్నతాధికారులకు లేఖ రాస్తామని రవాణాశాఖ వెల్లడించింది. ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనున్నట్లు తెలిపారు. 

ధరణిపై రేవంత్ రివ్యూ

హైదరాబాద్:  ధరణిలో పెండింగ్​లో  ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆదేశించారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. శనివారం సచివాలయంలో ధరణి కమిటీతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

వైఎస్ షర్మిల తనయుడి రిసెప్షన్ కు హాజరైన అగ్రనేతలు..  
 
Sharmila Son Wedding Reception: వైఎస్ షర్మిలారెడ్డి కుమారుడు రాజారెడ్డి వివాహ రిసెప్షన్‌కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ ​​పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్  ప్రధాన అతిథులుగా హాజరయ్యారు. అలాగే.. హైదరాబాద్‌లో జరిగిన ఈ  రిసెప్షన్‌ పార్టీకి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు రాష్ట్ర మంత్రులు, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షీ, పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. 

జూలై 1 నుండి అమలులోకి కొత్త క్రిమినల్ చట్టాలు
 
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు జులై 1నుంచి అమల్లోకి వస్తాయి. ఈ మేరకు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో ఈ చట్టాలు అమలవుతాయి. ఈ మూడు క్రిమినల్ చట్టాలకు గానూ శనివారం కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ న్యాయసంహిత-2023,, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023, భారతీయ సాక్ష్య బిల్లు-2023ai.. 1860 నాటి భారతీయ శిక్షాస్మృతి, 1973 నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC), 1872 నాటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో జూలై ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి. 

ప్రధాని మోడీకి తగ్గని క్రేజ్.. 

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచంలో ఏ దేశాధినేతకు లేని ఆదరణ భారత ప్రధాని మోడీకి ఉంది. ఈ విషయాన్నే అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సర్వే వెల్లడించింది. భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రపంచంలో ఏ దేశాధినేతకు లేని ఆదరణ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఉందంటంటే.. అతిశయోక్తి కాదు.  అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ ప్రకారం.. 78.5% ఆమోదం రేటింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నిలిచారు. 

ఉత్కంఠ మ్యాచ్‌లో.. యూపీ వారియర్స్ పై ఆర్సీబీ ఘనవిజయం..   
 
RCB vs UPW WPL 2024 Highlights: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనంగా బోణీ కొట్టింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో  యూపీపై ఆర్సీబీ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 156 పరుగులు చేసింది. ఇందులో రిచా ఘోష్ 37 బంతుల్లో 62 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడింది.   అలాగే.. తెలుగు అమ్మాయి సబ్బినేని మేఘన 44 బంతుల్లో 53 పరుగులు చేసిన అర్ధశతకంతో తన సత్తాచాటింది. చివరి బంతికి శ్రేయాంక పాటిల్‌ సిక్సర్‌ కొట్టి ఇన్నింగ్స్‌ను ముగించింది. యూపీ తరఫున రాజేశ్వరి గైక్వాడ్‌కు రెండు వికెట్లు దక్కాయి. గ్రేస్ హారిస్, తహ్లియా మెక్‌గ్రాత్, ఎక్లెస్టోన్, దీప్తి శర్మలకు ఒక్కో వికెట్ దక్కింది.
 

click me!