60 లక్షల మంది భక్తులు.. రూ.25 కోట్ల విరాళాలు , అయోధ్య రాములోరి దర్శనానికి పోటెత్తుతున్న జనం

By Siva KodatiFirst Published Feb 24, 2024, 9:58 PM IST
Highlights

శ్రీరాముని జన్మభూమి అయోధ్యలో రాములోరి దర్శనానికి దేశ, విదేశాలకు చెందిన వారు పోటెత్తుతున్నారు. నెల రోజుల్లో సుమారు 60 లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకున్నారు. అలాగే రూ.25 కోట్ల విరాళాలు, 25 కేజీల బంగారు, వెండి ఆభరణాలను సమర్పించినట్లు రామమందిర్ ట్రస్ట్ వెల్లడించింది. 

శ్రీరాముని జన్మభూమి అయోధ్యలో గత నెలలో భవ్యమైన రామమందిరం నిర్మితమైన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. అయితే రాములోరి దర్శనానికి దేశ, విదేశాలకు చెందిన వారు పోటెత్తుతున్నారు. నెల రోజుల్లో సుమారు 60 లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకున్నారు. అలాగే రూ.25 కోట్ల విరాళాలు, 25 కేజీల బంగారు, వెండి ఆభరణాలను సమర్పించినట్లు రామమందిర్ ట్రస్ట్ వెల్లడించింది. అయితే ట్రస్ట్‌కు సంబంధించిన బ్యాంక్ ఖాతాలలో భక్తులు నేరుగా జరిపిన ఆన్‌లైన్ లావాదేవీల వివరాల గురించి తమకు తెలియదన్నారు. 

ఇదిలావుండగా.. త్వరలో శ్రీరామనవమి వేడుకలు జరగనున్న నేపథ్యంలో సుమారు 50 లక్షల మంది భక్తులు అయోధ్యకు రావొచ్చునని ట్రస్ట్ అంచనా వేసింది. ఆ సమయంలో విరాళాలు కూడా భారీగా అందే అవకాశం వుండటంతో రసీదుల జారీకి కంప్యూటరైజ్డ్ కౌంటర్లతో పాటు అదనపు హుండీలను ఏర్పాటు చేస్తామని ట్రస్ట్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. భారీ మొత్తంలో వచ్చే నాలుగు ఆటోమేటిక్ హైటెక్ కౌంటింగ్ మెషీన్లను ఎస్‌బీఐ ఏర్పాటు చేసిందని చెప్పారు. భక్తులు సమర్పించిన బంగారు , వెండి ఆభరణాల నిర్వహణను ప్రభుత్వ మింట్‌కు అప్పగించినట్లు పేర్కొన్నారు.     

Latest Videos

click me!