సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించనుంది. సవరించిన మనీ లాండరింగ్ యాక్ట్పై దాఖలైన దాదాపు 250 పిటిషన్లపై తీర్పు ఇవ్వనుంది. చాలా మంది రాజకీయ నేతుల, వ్యాపారులు ఈ యాక్ట్ కారణంగా అరెస్టులు లేదా, దర్యాప్తులు ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ తీర్పుకు ప్రాధాన్యత సంతరించుకుంది.
న్యూఢిల్లీ: సవరించిన మనీ లాండరింగ్ యాక్ట్(ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్)లోని పలు ప్రొవిజన్లను సవాల్ చేస్తూ దాదాపు 250 పిటిషన్లు సుప్రీంకోర్టులో ఫైల్ అయ్యాయి. ఈ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. జస్టిస్ ఏఎం ఖాన్విల్కార్ సారథ్యంలోని జస్టిస్ సీటీ రవి కుమార్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిల ధర్మాసనం ఈ తీర్పు ఇవ్వనుంది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ పీఎంఎల్ఏ యాక్ట్ కింద పొందే అనేక అధికారాలపై గురించి వివరణలు ఉండనుండటంతో ఈ తీర్పుకు ప్రాధాన్యత సంతరించుకున్నది. దర్యాప్తు అధికారాలు, సాక్షులకు సమన్లు పంపడం, అరెస్టులు చేయడం, సీజ్లు చేయడం, ఈ మనీ లాండరింగ్ యాక్ట్లో బెయిల్ ప్రక్రియ వంటి పలు అంశాలపై సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వనుంది.
ఇది రాజకీయంగా సున్నితమైన చట్టంగా ఉండటంతో సుప్రీంకోర్టు తీర్పుపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మనీ లాండరింగ్ యాక్ట్ కింద పలువురు నేతలు, బిజినెస్మన్లు, ఇతరులు అరెస్టులు ఎదుర్కోవడం లేదా సమన్లు ఎదుర్కోవడం వంటివి ఉన్నాయి. కాబట్టి, ఈ తీర్పు ప్రస్తుత రాజకీయ నేతలనూ ప్రభావితం చేయగా.. భవిష్యత్లోనూ ఈడీ దాడుల తీరు మారనుంది.
ప్రస్తుతం ఈ చట్టం కింద ఈడీకి ఉన్న అరెస్టు అధికారాలు, బెయిల్ మంజూరు, ఆస్తుల స్వాధీనం వంటివన్నీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వెలుపలే ఉన్నాయి. ఈ ఈడీ పూర్తిగా పోలీసు అధికారాలను కలిగి ఉంటున్నదని, కాబట్టి, సీఆర్పీసీకి బద్ధమై ఉండాలని ఎక్కువ మంది పిటిషనర్లు వాదిస్తున్నారు. కానీ, ఈడీ పోలీసు ఏజెన్సీ కాదు కాబట్టి, ఆ ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్నప్పుడు నిందితులు సమర్పించే వాంగ్మూలాలు, స్టేట్మెంట్లను.. నిందితులకు బెయిల్ వ్యతిరేకించడానికి ఉపయోగించవచ్చు. ఇది నిందితుడి లీగల్ రైట్స్ను ఉల్లంఘిస్తున్నాయి.
దర్యాప్తును ప్రారంభించడం, నిందితుడు లేదా సాక్ష్యులను విచారించడానికి సమన్లు పంపడం, వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం, ఆస్తుల అటాచ్మెంట్ల కోసం ఈడీ అనుసరిస్తున్న విధానాలు ప్రాథమిక హక్కులు కల్పించే స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్లు వాదిస్తున్నారు.
మనీ లాండరింగ్ కేసులో గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష ఉన్నప్పటికీ బెయిల్ పొందడం చాలా కష్టతరం.
మనీ లాండరింగ్ యాక్ట్లోని సెక్షన్ 50 కింద ఈడీ ఎవరికైనా సమన్లు పంపి.. వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేసి, వాటిపై సంతకం బలవంతపెట్టడం వంటివి సమన్లు పొందిన వారికి రాజ్యాంగం కల్పించిన రక్షణలను గండికొట్టడమేనని పేర్కొంటున్నారు. దర్యాప్తులో రికార్డు చేసిన వాంగ్మూలాలు, స్టేట్మెంట్లను ఆధారాలుగా చూపెట్టడానికి ఈ చట్టంలోని నిబంధనలు వీలు కల్పిస్తున్నాయి. దీనిపైనా పిటిషనర్లు ఆందోళనలు లేవనెత్తుతున్నారు.