ఉత్తరప్రదేశ్లో కాన్పూర్లో ( Kanpur) పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వివిధ ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మరికొద్ది నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో మంగళవారం పర్యటించారు. కాన్పూర్లో ( Kanpur) పర్యటించిన ఆయన ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ‘మీ కూతుళ్లను చదివించండి. వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు’ అని పీఎం స్వానిధి పథకం (PM Svanidhi Scheme) లబ్దిదారు అయిన కాన్పూర్లోని కిద్వాయ్నగర్కు చెందిన ఫర్జానాతో మోదీ చెప్పారు. అయితే ఈ సందర్భంగా ఫర్జానా.. తన భర్త నాలుగేళ్ల క్రితం ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకున్నాడని తెలిపారు.
లాక్డౌన్ సమయంలో పీఎం స్వానిధి పథకం కింద తీసుకున్న రుణం సాయంతో తాను ఇప్పుడు దోసెలు, ఇడ్లీలు అమ్ముతూ చిన్న ఫాస్ట్ ఫుడ్ జాయింట్ను నడుపుతున్నానని ఆమె ప్రధాని మోదీకి చెప్పారు. ఈ సందర్భంగా ఆమె.. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో ఫొటో దిగాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు. ఆ ఫొటోను తన చిన్న దుకాణంలో ఉంచుతానని చెప్పారు. దీంతో మోదీ వెంటనే ఆమె తలపై చేయి వేసి ఆశీర్వదించారు. ఆమె కోరినట్టుగానే ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్లు ఆమోతో కలిసి ఫొటో దిగారు.
ఈ సందర్భంగా ఫర్జానా.. ‘మీ వల్లే నా ఇద్దరు కూతుళ్లను చదివించగలుగుతున్నాను. నా కూతుళ్లను బాగా చదివించాలని కోరుకుంటున్నాను. చాలా దారుణమైన రోజులు చూశాను. నాలుగేళ్ల క్రితం నా భర్త తలాక్ చెప్పడంతో ఇద్దరు చిన్న కూతుళ్లతో కలిసి ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. నా కేసు ఇంకా కోర్టులో ఉంది. నా కూతుళ్లకు ఇల్లు లేదు, వాళ్లను చదివించాలనుకుంటున్నాను’ అని మోదీకి చెప్పారు.
In Kanpur, had a satisfying interaction with beneficiaries of various Government schemes. Have a look… pic.twitter.com/PM8T5GbG7y
— Narendra Modi (@narendramodi)ఇక, గత వారం ప్రయాగ్రాజ్లో పర్యటించిన మోదీ.. సహారన్పూర్కు చెందిన షబానా పర్వీన్ (Shabana Parveen), ఆమె తొమ్మిది నెలల కుమార్తెను కలిశారు. ఈ సందర్భంగా మోదీ.. బ్యాంకింగ్ కరస్పాండెంట్ (బ్యాంక్ సఖి)గా పనిచేస్తున్న పర్వీన్ను ఆమె పని గురించి అడిగి తెలుసుకున్నారు.