
ఢిల్లీ: భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మాతృభూమిపై అడుగుపెట్టడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. వాఘా-అటారీ సరిహద్దు వద్ద మాతృభూమిపై అడుగు పెట్టిన అభినందన్కు స్వాగతం పలుకుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
అభినందన్ ధైర్య సాహసాలు దేశానికి ఎంతో గర్వకారణమంటూ ట్వీట్ లో కొనియాడారు. దేశంలోని సాయుధ బలగాలు 130 కోట్ల మంది భారతీయులకు ఆదర్శనీయమన్నారు. వందేమాతరం అంటూ ట్విట్ చేశారు మోదీ. ఇకపోతే పాక్ అధికారులు అభినందన్ ను శుక్రవారం రాత్రి 9 గంటల తర్వాత భారత్ అధికారులకు అప్పగించారు.
అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ అభినందన్ వర్థమాన్ ను అమృత్ సర్ కు తరలించారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. ఇద్దరు ఎయిర్ మార్షల్స్ ఆధ్వర్యంలో అభినందన్ తో పాటు అతడి తల్లిదండ్రులను ఢిల్లీకి తరలించారు.
అభినందన్ రాకతో యావత్ భారతదేశమంతా సంబరాలు చేసుకుంది. ప్రతీ భారతీయుడు దేశభక్తితో ఉప్పొంగిపోయాడు. కోట్లాది మంది భారతీయులు అభినందన్ కు స్వాగతం పలికారు. అభినందన్ రాక సందర్భంగా దేశవ్యాప్తంగా జై హింద్, భారత్ మాతాకీ జై అన్న నినాదాలు మిన్నంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి
పుణ్యభూమికి తిరిగి చేరుకోవడం ఆనందదాయకం : అభినందన్ విడుదలపై పవన్
అభినందన్ దేశభక్తికి నా వందనం: చంద్రబాబు