జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో పర్యటకులపై భీకర ఉగ్రదాడి విషయం తెలిసిన ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని ఈ విషయం తెలిసిన వెంటనే అలర్ట్ అయ్యారు. హోం మంత్రి అమిత్షాతో ఫోన్లో మాట్లాడి, దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా తన పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకొని భారత్ బయలుదేరారు..
నిజానికి ప్రధాని రెండు రోజుల పర్యటనలో భాగంగా సౌదీ వెళ్లారు. కానీ ఉగ్రదాడి నేపథ్యంలో పర్యటనను కుదించుకొని హుటాహుటిన భారత్ తిరుగుపయనమ్యారు. మంగళవారం రాత్రి భారత్కు బయలు దేరిన మోదీ బుధవారం ఉదయం ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. బుధవారం ఉదయం దిల్లీ ఎయిర్పోర్టులో దిగిన ప్రధాని మోదీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు దాడి తీరును వారు ప్రధానికి వివరించారు. ప్రధాని అధ్యక్షతన మరికాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ఇదిలా ఉంటే కేంద్ర హోం మంత్రి అమిత్షా ఇప్పటికే శ్రీనగర్కు చేరుకుని, భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. కాసేపట్లో అమిత్షా దాడి చోటుచేసుకున్న పహల్గాం ప్రాంతానికి వెళ్లి పరిశీలించనున్నారు.
పర్యాటకులతో సందడి ఉన్న పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు మంగళవారం భీకర దాడికి దిగారు. ఈ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులకు అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 28 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి.