
NPP leader Prestone Tynsong: త్రిపుర అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మార్చి 7న జరిగే ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.
వివరాల్లోకెళ్తే.. త్రిపుర మాజీ ఉపముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) నేత ప్రెస్టన్ టైన్సాంగ్ మాట్లాడుతూ మార్చి 7న జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని తెలిపారు. వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇటీవల జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సంపూర్ణ మెజారిటీ సాధించి రాష్ట్రంలో తిరిగి అధికారం చేపడుతోంది. దాదాపు 39 శాతం ఓట్లతో బీజేపీ 32 సీట్లు గెలుచుకుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. టిప్రా మోతా పార్టీ 13 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 11 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ మూడు స్థానాలను గెలుచుకుంది. ఇండిజెనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) ఒక స్థానాన్ని గెలుచుకుంది. ముఖ్యమంత్రి మాణిక్ సాహా శుక్రవారం తన రాజీనామా లేఖను గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యకు సమర్పించారు.
కాగా, అగర్తలాలోని వివేకానంద మైదానంలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రధాని రాష్ట్ర పర్యటనపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే సిన్హా ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నారు. ఇవాళ ఎస్పీజీ బృందం కూడా రానుంది. మార్చి 7న జరిగే కొత్త ప్రభుత్వ ప్రారంభోత్సవానికి ప్రధాని హాజరవుతారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలోనే అసోం ముఖ్యమంత్రి, ఎన్ఈడీఏ చీఫ్ హిమంత బిశ్వ శర్మ శనివారం రాత్రికి రాష్ట్రానికి చేరుకోనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన కీలక నేతలను, ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేబతి త్రిపుర తెలిపారు.
బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ మహేష్ శర్మ, ఎన్నికల ఇంచార్జ్ మహేంద్ర సింగ్ కూడా ఈశాన్య రాష్ట్రంలోనే ఉన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల సమావేశం ఇంకా ఖరారు కాలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నబేందు భట్టాచార్య తెలిపారు. కాగా, ఇటీవల జరిగిన మూడు ఈశాన్య భారత రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ లో మరోసారి బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు కానుంది. రెండు రాష్ట్రాల్లో బీజేపీ కూటమి సంపూర్ణ మెజారిటీ సాధించగా, నాగాలాండ్ లో హంగ్ ఏర్పడింది. అక్కడ 25 స్థానాలను గెలుచుకున్న ఎన్డీపీపీ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి.