Pegasus Issue: పౌరుల గోప్యతే ముఖ్యం.. కేంద్రానికి సుప్రీం అంక్షింతలు, విచారణకు కమిటీ నియామకం

By Siva KodatiFirst Published Oct 27, 2021, 11:09 AM IST
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ వ్యవహారంపై (Pegasus Case) సుప్రీంకోర్ట్ (supreme court) బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తీర్పు సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మనం సమాచార యుగంలో జీవిస్తున్నామని.. సాంకేతికత ఎంత ముఖ్యమో గుర్తించాలని సుప్రీం సూచించింది. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ వ్యవహారంపై (Pegasus Case) సుప్రీంకోర్ట్ (supreme court) బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తీర్పు సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మనం సమాచార యుగంలో జీవిస్తున్నామని.. సాంకేతికత ఎంత ముఖ్యమో గుర్తించాలని సుప్రీం సూచించింది. ఇదే సమయంలో గొప్యత హక్కును కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని సుప్రీం తెలిపింది. పెగాసస్‌పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిపుణుల కమిటీ (experts committee) ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై నిపుణుల కమిటీ దర్యాప్తు చేయనుంది. సుప్రీంకోర్ట్ రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో కమిటీ పనిచేయనుంది. ఏడు అంశాలపై నిపుణుల కమిటీ దర్యాప్తు చేయనుంది. కమిటీ ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ప్రతిపాదన తిరస్కరించింది. జాతీయ భద్రత పేరుతో కేంద్రం బాధ్యతల నుంచి తప్పించుకోలేదని సుప్రీం వ్యాఖ్యానించింది. 

నిపుణుల కమిటీకి సుప్రీంకోర్ట్ రిటైర్డ్ జడ్జీ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వం వహించనున్నారు. ఇక సభ్యులుగా రిటైర్డ్ ఐపీఎస్ అలోక్ జోషీ, డాక్టర్ ప్రభాహరన్ (స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, కేరళ).. ప్రొఫెసర్ అశ్విన్ అనిల్ (ఐఐటీ ముంబై), సందీప్ ఒబరాయ్‌లు వ్యవహరించనున్నారు. 

పెగాసస్ హ్యాకింగ్‌పై వచ్చిన ఆరోపణలను అన్ని కోణాల్లో పరిశీలించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం గతంలోనే వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. అలాగే ఈ కథనాలకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ కథనాలన్నీ ఊహాజనితమైనవేనని.. స్వార్థ ప్రయోజనంతో వ్యాప్తి చేసే ఇలాంటి కథనాలపై నెలకొన్న అనుమానాలను తొలగించేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తుందని కేంద్రం సుప్రీంకు వెల్లడించింది. తాజాగా కేంద్రం ప్రతిపాదనను సుప్రీం తిరస్కరించింది.

ALso Read:పెగాసెస్ : కేంద్రం అఫిడవిట్ అందుకే దాఖలు చేయడం లేదు.. సుప్రీంకు వివరణ..

కాగా, ఫోన్లను ట్యాపింగ్ చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఏడాది పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ధ్వజమెత్తాయి. జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయ అసమ్మతివాదులతో సహా 300 మందికి పైగా ప్రముఖుల ఫోన్‌లను పెగసాస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి హ్యాక్ చేసినట్లు భారతదేశంలో ఇజ్రాయెల్ కంపెనీ ఎన్‌ఎస్‌ఓ ఆరోపణలు ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బిజెపి మంత్రులు అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫోన్ నంబర్లు ఇజ్రాయెల్ స్పైవేర్ ద్వారా హ్యాకింగ్ చేసినట్లు జాబితా చేశారు. 

click me!