కంగనా నుంచి పద్మ అవార్డు వెంటనే వెనక్కి తీసుకోవాలి.. పార్టీల డిమాండ్

By telugu teamFirst Published Nov 12, 2021, 1:37 PM IST
Highlights

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వివాదాస్పద వ్యాఖ్యలో మరోసారి ఇరకాటంలో పడ్డారు. దేశానికి 2014లోనే స్వాతంత్ర్యం వచ్చిందని, 1947లో వచ్చింది భిక్షమే అని నోరుపారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. కేంద్ర ప్రభుత్వం ఆమెకు అందించిన పద్మ శ్రీ అవార్డును వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ సహా పలుపార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
 

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి Kangana Ranaut చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఆమెపై Sedition కింద కేసు నమోదు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ముంబయి పోలీసులకు పిటిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు Congress సహా పలు పార్టీల నుంచి కంగనా రనౌత్ పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమెకు ఇచ్చిన Padma Shri అవార్డును వెంటనే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లూ పెరుగుతున్నాయి.

టైమ్స్ నౌ అనే జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కంగనా రనౌత్ పాల్గొని మాట్లాడారు. British పాలనకు కొనసాగింపే కాంగ్రెస్ హయాం అని ఆమె అన్నారు. అంతేకాదు, 1947లో బ్రిటీష్ వాళ్లు మనకు భిక్షం వేశారని నోరుపారేసుకున్నారు. నిజానికి దేశానికి స్వాతంత్ర్యం 2014లో వచ్చిందని సెలవిచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరాన్నే పేర్కొంటూ ఆమె మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా అన్ని వార్గాల నుంచి తీవ్ర వ్యతిరేకతను తెచ్చాయి.

కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని, వాటిని ఉపేక్షించలేమని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. అంతేకాదు, స్వాతంత్ర్య సమరయోధుల(Freedom Fighters) త్యాగాలను ఆమె అవహేళన చేసిందని మండిపడ్డారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ సారథ్యంలో జరిగిన స్వాతంత్ర్య సమరాన్ని అగౌరవపచడమే కాదు.. తిరుగుబాటుదారులు సర్దార్ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ సహా మరెందరో అమరుల ప్రాణ త్యాగాలను కించపరిచారని ట్విట్టర్‌లో ట్వీట్లు చేసి ఆగ్రహించారు. పద్మ శ్రీ వంటి అవార్డులు ఇచ్చేటప్పుడు వారి మానసిక పరిపక్వతనూ పరిగణనలోకి తీసుకోవాలని సూచనలు చేశారు. తద్వార దేశానికి, దేశ యోధులనూ అగౌరవ పరచకుండా చర్యలు తీసుకున్నవారమవుతామని వివరించారు. పద్మ శ్రీ అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: ‘1947లో భిక్షం.. 2014లోనే దేశానికి స్వాతంత్ర్యం’.. కంగనా రనౌత్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఫైర్

హర్యానా మాజీ సీఎం భుపిందర్ సింగ్ హూడా కూడా కంగనా రనౌత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలు విచక్షణా రహితంగా ఉన్నాయని అన్నారు. బిహార్‌లో అధికారంలోని ఎన్‌డీఏ కూటమి పార్టీ హిందుస్తానీ అవామ్ మోర్రచా అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగనా రనౌత్‌కు ఇచ్చిన పద్మ శ్రీ అవార్డును వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. లేదంటే గాంధీ, నెహ్రూ, పటేల్, భగత్ సింగ్, కలాం, ముఖర్జీ, సావర్కర్ వీరంతా.. స్వాతంత్ర్యం కోసం అడుక్కున్నారనే ప్రపంచం అర్థం చేసుకునే ముప్పు ఉన్నదని తెలిపారు. అంతేకాదు, ఇక మీదట మీడియా అంతా కూడా ఆమెను ప్రసారం చేయకుండా నిర్ణయాలు తీసుకోవాలని సూచనలు చేశారు.

కంగనా రనౌత్‌పై దేశద్రోహం మోపాలని, ఆమెకు అందించిన పద్మ శ్రీ అవార్డును వెంటనే ఉపసంహరించాలని శివసేన పార్టీ డిమాండ్ చేసింది. ఎన్‌సీపీ కూడా తీవ్రస్థాయిలో ఫైర్ అయింది. ఆమె స్వాతంత్ర్య సమర యోధులను అగౌరవ పరిచారని మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమె నుంచి పద్మ శ్రీ అవార్డును వెనక్కి తీసుకుని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కంగనా రనౌత్ మలానా క్రీమ్ డోసు(హిమాచల్ ప్రదేశ్‌లోనే పెరిగే ఓ రకమైన హషిష్ మత్తు పదార్థం) కొంచెం ఎక్కువ తీసుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్టు అనిపిస్తున్నదని మండిపడ్డారు. 

Also Read: Kangana ranaut: అతన్ని ప్రేమిస్తున్నాను, త్వరలో పెళ్లి ? పర్సనల్ విషయాలపై ఓపెన్ అయిన ఫైర్ బ్రాండ్ కంగనా

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ నిన్ననే కంగనా రనౌత్‌పై విమర్శలు కురిపించారు. ఆమెది పిచ్చితనం అనాలా? దేశద్రోహం అనాలా? అర్థం కావడం లేదని తెలిపారు. కొన్నిసార్లు మహాత్మా గాంధీని కించపరుస్తారని, మరోసారి ఆయనను చంపిన వారిని పొగడుతారని పేర్కొన్నారు. 

click me!