బాలికపై గ్యాంగ్ రేప్... శీలానికి వెల

By ramya neerukondaFirst Published Sep 10, 2018, 9:43 AM IST
Highlights

పంచాయితీ పెద్దల తీర్పును వ్యతిరేకిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత యువతి సోదరుడిపై గ్రామం నుంచి బహిష్కరించారు.కాగా  పోలీసులు గ్రామ పెద్దలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

బాలికను అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసిన నిందితులకు శిక్ష విధించాల్సిందిపోయి.. ఆ బాలిక శీలానికి రూ.80వేలతో వేలకట్టారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...అలీఘడ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికను నలుగురు యువకులు నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు. బాధిత బాలికకు తల్లిదండ్రులు మరణించడంతో సోదరుడు ఒక్కడే ఉన్నాడు. గ్రామ పెద్దలు సమావేశమై అత్యాచారం చేసిన నలుగురు కామాంధులు బాధిత బాలికకు రూ.80వేలు జరిమానాగా చెల్లించాలని పంచాయితీలో తీర్పు చెప్పారు.

 కూలీపని చేస్తున్న బాలిక సోదరుడు తన చెల్లెలి శీలానికి గ్రామ పెద్దలు వెల కడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహారం అక్కరలేదని, నిందితులకు శిక్ష పడాలని బాధిత బాలిక సోదరుడు ఈ అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులైన చేతన్ (24), లఖన్ (30), లలిత్ కుమార్ (22), వికాస్ (24)లపై ఐపీసీ సెక్షన్ 376 డి, 354, 506, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి, ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పంచాయితీ పెద్దల తీర్పును వ్యతిరేకిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత యువతి సోదరుడిపై గ్రామం నుంచి బహిష్కరించారు.కాగా  పోలీసులు గ్రామ పెద్దలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

click me!