
Pakistan violates ceasefire: పాకిస్తాన్ వరుసగా 10వ రోజు నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణను ఉల్లంఘించింది. పాకిస్తాన్ సైన్యం జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా, పుంచ్, రాజౌరీ, మెండర్, నౌషెరా, సుందర్బని, అఖ్నూర్ వంటి ప్రాంతాలపై కాల్పులు జరిపింది. అయితే పాక్ దుశ్చర్యలకు భారత సైన్యం దీటుగా బదులిస్తోంది.
శని, ఆదివారం రాత్రి జమ్మూ కాశ్మీర్లోని ఐదు జిల్లాల్లోని ఎనిమిది ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని అధికారులు తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో భారత సైనికులెవ్వరికీ గాయాలు కానీ, ప్రాణనష్టం కానీ జరగలేదు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడి తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అప్పటి నుంచి వరుసగా 10వ రాత్రి పాకిస్తాన్ కాల్పులు జరుపుతోంది. నియంత్రణ రేఖకు అవతల ఉన్న పాకిస్తాన్ చెక్పోస్టుల నుంచి ఈ కాల్పులు జరిగాయి.
ఉత్తర కాశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా జిల్లాల్లో మొదట కాల్పులు జరిగాయి. ఆ తర్వాత పుంచ్, జమ్మూ ప్రాంతంలోని అఖ్నూర్ సెక్టార్కు విస్తరించాయి. ఆ తర్వాత రాజౌరీ జిల్లాలోని సుందర్బని, నౌషెరా సెక్టార్లలో కూడా పాకిస్తాన్ సైనికులు నియంత్రణ రేఖ వద్ద చెక్పోస్టులపై కాల్పులు జరిపారు.
కేవలం సరిహద్దుల్లో కాల్పులకు తెగబడటమే కాదు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి మరీ దాడులకు యత్నిస్తోంది పాక్ ఆర్మీ. ఇలా తాజాగా భారత సరిహద్దులోకి చొరబడ్డ పాక్ రేంజర్ ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. పాకిస్తాన్ రేంజర్లు బీఎస్ఎఫ్ జవానును అరెస్ట్ చేసిన కొన్ని రోజులకే ఇది జరిగింది.
నిన్న శనివారం బీఎస్ఎఫ్ రాజస్థాన్ సరిహద్దులో ఒక పాకిస్తాన్ రేంజర్ ని అరెస్ట్ చేసింది. ఇటీవల పాక్ అదుపులోకి తీసుకున్ని భారత జవానును తిరిగి తెచ్చుకోవడంలో ఇది కీలకం కానుంది. జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గాం ఉద్రిక్తతల వేళ బీఎస్ఎఫ్ జవాను అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి ఆ దేశ ఆర్మీకి చిక్కాడు. అతడిని విడిపించేందుకు భారత ఆర్మీ ప్రయత్నిస్తోంది... కానీ పాక్ విడుదలకు అంగీకరించడంలేదు. ఇలాంటి సమయంలో పాక్ జవాన్ భారత ఆర్మీకి చిక్కడంతో మన సైనికుడి విడుదల ఈజీ కానుంది.
బీఎస్ఎఫ్ వర్గాల సమాచారం ప్రకారం, రాజస్థాన్ సరిహద్దులో ఈ రేంజర్ ని అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతుండగా పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో అతను సమాధానం చెప్పలేకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ రాజస్థాన్ లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దులో జరిగింది. దీంతో రాజస్థాన్ లోని సంబంధిత ప్రాంతాల్లో ఆందోళన మొదలైంది.
పాకిస్తాన్ లో బందీగా ఉన్న భారత జవాను ఇంకా విడుదల కాలేదు. ఏప్రిల్ 23న బీఎస్ఎఫ్ జవాను పూర్ణం కుమార్ షాని పాకిస్తాన్ రేంజర్లు పంజాబ్ సరిహద్దులో అరెస్ట్ చేశారు. భారత్ ఎన్నిసార్లు అడిగినా పాకిస్తాన్ ఇంకా ఆ జవానును విడుదల చేయలేదు.