జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 7 మంది పర్యాటకులు గాయపడ్డారు. కాల్పుల్లో ఒకరు మరణించినట్లు సమాచారం.
Pahalgam Terror Attack : జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి అమాయక ప్రజలపై కాల్పులకు దిగారు. దక్షిణ కాశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలోని బైసరన్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసారు. మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో ఒకరు మరణించగా, కనీసం ఏడుగురు గాయపడ్డారు.
ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారని, తన భర్త తలకు తుపాకీ తూటాలు తగిలి తీవ్రంగా గాయపడ్డారని కాశ్మీర్ పోలీస్ పీసీఆర్కు ఓ మహిళా పర్యాటకురాలు ఫోన్ చేసి సమాచారం అందించింది. దీంతో వెంటనే అక్కడికి భద్రతా బలగాలు చేరుకున్నారు. అయితే అప్పటికే కాల్పులు జరిపినవారు అక్కడినుండి పరారయ్యారు. గాయపడినవారిని పోలీసులు దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ట్రెక్కింగ్కు వెళ్లిన పర్యాటకులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సహా భద్రతా దళాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ దాడిలో పలువురు పర్యాటకులు గాయపడినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ దాడి మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. పహల్గాంలోని బైసరన్ మైదానంలో పర్యాటకులపై ఉగ్రవాదుల బృందం కాల్పులు జరిపిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారు సైనిక దుస్తుల్లో ఉన్నారని పర్యాటకులు చెప్పారు.
దాడి జరిగిన ప్రదేశం నుంచి వచ్చిన దృశ్యాలను పరిశీలిస్తే మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. స్థానికులు వారి సహాయానికి పరుగులు తీస్తుండగా ఇద్దరు మహిళలు బాధతో ఏడుస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు దగ్గర నుంచి పర్యాటకులపై కాల్పులు జరిపడంతో పలువురు గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
మరో కేసులో పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ముష్తాక్ అలీ అలియాస్ బచ్చు డాన్ పోలీసుల కస్టడీ నుండి తప్పించుకునే ప్రయత్నంలో గాయపడి మరణించాడు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు మంగళవారం తెలిపిన ప్రకారం, నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత అమృత్సర్ నుంచి జమ్మూకు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
అధికారిక ప్రకటన ప్రకారం, పంజాబ్ పోలీసుల సహాయంతో ఇద్దరు వాంటెడ్ వ్యక్తులను పట్టుకోవడానికి జమ్మూ నుంచి ఒక పోలీసు బృందం సోమవారం పంజాబ్లోని అమృత్సర్లోని బాబా బటాలాకు పంపబడింది. మహమ్మద్ సాదిక్ కుమారుడు, బారి బ్రాహ్మణలోని కిక్రీ మోర్ నివాసి ముష్తాక్ అలీతో సహా ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. జమ్మూ-కథువా-సంబా పరిధిలోని పలు క్రిమినల్ కేసుల్లో వీరిద్దరూ నిందితులు.
అమృత్సర్ నుంచి తిరిగి వస్తుండగా, నిందితులు టాయిలెట్ కోసం వాహనం ఆపాలని పోలీసులను కోరినట్లు తెలిసింది. ఆగిన సమయంలో ఇద్దరు నిందితులు పోలీసు సిబ్బందిపై దాడి చేసి, వారి ఆయుధాలను లాక్కోని పారిపోయేందుకు ప్రయత్నించినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. దీంతో వారిపై కాల్పులు చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.