
అహ్మదాబాద్: అది సీఎం కార్యక్రమం. అధికారులంతా అత్యంత జాగరూకతతో మెలుగుతున్నారు. ఇతర నేతలూ అంతా గంభీరంగా ఉన్నారు. కానీ, ఓ అధికారి మాత్రం కునుకు తీశారు. ఎవరూ చూడకుంటే అది బయటకు తెలిసేది కాదు. కానీ, ఓ కెమెరా కన్ను ఆయనను పట్టేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ అధికారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటన గుజరాత్లో జరిగింది.
గుజరాత్ సీఎం భుపేంద్ర పటేల్ కచ్ జిల్లాకు వెళ్లారు. అక్కడ భూకంప బాధితులకు పునరావాసం కల్పించారు. వారికి పట్టాల పంపిణీ చేయడానికి సీఎం భుపేంద్ర పటేల్ వెళ్లారు. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుండగా.. కచ్ జిల్లాలోని భుజ్ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్ నిద్రలోకి జారుకున్నారు. అసలే అది సీఎం కార్యక్రమం కావడంతో కెమెరాలు పోటాపోటీగా అక్కడి తతంగాన్ని షూట్ చేస్తున్నాయి. అందులోని ఓ కెమెరా కునుకు తీస్తున్న జిగర్ పటేల్ను పట్టేసింది. ఈ వీడియో బయటకు వచచ్చింది. అనంతరం, గంటల వ్యవధిలోనే శనివారం సస్పెన్షన్ ఆదేశాలు జారీ అయ్యాయి.
Also Read: మే 27, 28 తేదీల్లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు.. స్థలాన్ని పరిశీలించిన నేతలు
భుజ్ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్ను రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ హౌజింగ్ శాఖ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బాధ్యతలు నిర్వర్తించడంలో సదరు అధికారి నిర్లక్ష్యం వహించారని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆయన నడవడిక గాడి తప్పిందని, అందుకే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటున్నట్టు వివరించారు.