
న్యూఢిల్లీ:మణిపూర్ లో చేలరేగిని హింస నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కావాలని అభ్యర్థించారు. ఈ మేరకు 40 మంది ఎమ్మెల్యేలు పీఎంఓకు లేఖ రాశారు. మణిపూర్ రాష్ట్రంలోని రెండు గిరిజన తెగల మధ్య హింస చెలరేగింది.
దీంతో రాష్ట్రంలో మూడు నెలలుగా అశాంతి నెలకొంది. పార్లమెంట్ ఉభయ సభల్లో మణిపూర్ అంశంపై విపక్ష పార్టీలు అధికార పక్షంపై ఒత్తిడి తెస్తున్నాయి. పార్లమెంట్ లో ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై ప్రధానితో మాట్లాడించాలనే ఉద్దేశ్యంతో మోడీ సర్కార్ పై విపక్షాలు అవిశ్వాసం తీర్మానం ప్రవేశ పెట్టారు.ఈ తీర్మానంపై చర్చ జరుగుతుంది.ఈ తీర్మానంపై చర్చలో భాగంగా ప్రధాని మోడీ సమాధానం ఇవ్వనున్నారు.ఈ తరుణంలో మోడీకి మణిపూర్ కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు మోడీతో భేటీ కావాలని లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఎన్ఆర్సీని అమలు చేయాలని ఎమ్మెల్యేలు ఆ లేఖలో కోరారు.
మొత్తం ఆరు డిమాండ్లను ఎమ్మెల్యేలు ఆ లేఖలో ప్రస్తావించారు.బుధవారంనాడు సాయంత్రం ఈ లేఖను సమర్పించేందుకు ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రంలో బలగాలను మరింత పెంచాలని ఆ లేఖలో కోరారు.శాంతి భద్రతల వాతావరణాన్ని పెంపొందించేందుకు పూర్తి నిరాయుధీకరణ అవసరమని సంతకాలు చేశారు ఎమ్మెల్యేలు. అన్ని సాయుధ సమూహాల నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు.కొన్ని సాయుధ విదేశీ దళాలు కూడ హింసకు కూడ కారణమని ఆ లేఖలో ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలో శాశ్వత శాంతిని నిర్ధారించడానికి కేంద్ర భద్రతా దళాలు మరింత చురుకుగా వ్యవహరించాలని ఎమ్మెల్యేలు కోరారు.
రైతులు పొలాల్లోకి వెళ్లిన సమయంలో మిలిటెంట్లు దాడులకు దిగుతున్నారని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అత్యాధునిక ఆయుధాలను నిందితులు ఉపయోగిస్తున్నారని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కేంద్ర భద్రతా బలగాల సమక్షంలోనే నిందితులు కాల్పులకు దిగుతున్నారని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.