
అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపణ కార్యక్రమం గత నెల ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుక అనంతరం సాధారణ భక్తులకు కూడా ఆ బాల రాముడి దర్శనం లభిస్తోంది. అయితే భక్తుల కోసం ఆలయాన్ని తెరిచిన రోజు ఓ కోతి వచ్చి రాముడిని దర్శించుకుంది. ఈ విషయాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్వయంగా వెల్లడించింది.
మోడీ ఓబీసీ కాబట్టే శంకరాచార్యులు అయోధ్యకు రాలేదు - ఉదయనిధి స్టాలిన్
రామ్ లల్లా దర్శనం కోసం హనుమంతుడే స్వయంగా వచ్చాడని ఆ ట్రస్ట్ ప్రకటించింది. అయితే అయోధ్యలోని రామమందిరంలో బాలక్ రామ్ విగ్రహం 'ప్రాణ ప్రతిష్ఠ' అనంతరం కూడా ప్రతీ రోజు అక్కడికి కోతులు వస్తున్నాయట. దానికి సంబంధించిన వీడియోలు పలువురు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడవి వైరల్ గా మారాయి.
వెదురు స్తంభం ఎక్కి రాముడి పాదాలను తాకేందుకు ఓ కోతి ప్రయత్నిస్తున్న వీడియోను ఓ యూజర్ షేర్ చేశారు. మరో వ్యక్తి లంగూర్ పూజా స్థలాన్ని సందర్శించి హవన్ సైట్ వద్ద నమస్కరిస్తున్న వీడియోను షేర్ చేశారు. భక్తులతో కిటకిటలాడే ఆలయంలోని పవిత్ర పీఠంపైకి ఓ కోతి ఎక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారింది.
మరో వీడియోలో కూడా ఓ కోతి ఆలయంలోకి ప్రవేశించింది. దీంతో భక్తులు ఆ కోతికి తినేందుకు అరటిపండ్లు వంటివి ఇచ్చినా.. దేనిని ముట్టుకోలేదు. వెంటనే శ్రీరాముడి విగ్రహం ముందు కాసేపు బుద్ధిగా కూర్చుంది. కొంత సమయం తరువాత శ్రీరాముడి పాదాలను కూడా తాకి వెళ్లిపోయింది. దీంతో అక్కడున్న భక్తులు చేతులు జోడించి జైశ్రీరామ్, జైశ్రీ హనుమాన్ అంటూ నినాదాలు చేశారు.
కాశీ, మథురలకు విముక్తి లభిస్తే.. ఇతర ఆలయాల వివాదాలకూ పరిష్కారం - గోవింద్ దేవ్ గిరి మహరాజ్
‘‘2024 జనవరి 22 న అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్ఠ రోజున, మహారాష్ట్రలోని లోనావాలాలోని శ్రీరామ మందిరాన్ని ఒక కోతి సందర్శించింది’’ అని ఎస్ కే చక్రవర్తి అనే యూజర్ పేర్కొన్నారు. ఈ వీడియోపై స్పందించిన యూజర్లు,, ఇందులో ఏదో దివ్యశక్తి ఉందని, వచ్చింది స్వయంగా హనుమంతుడే అని కామెంట్లు పెట్టారు. కాగా.. బాలక్ రామ్ శిల్పి అరుణ్ యోగిరాజ్ కూడా ఇలాంటి విషయాన్ని గతంలో వెల్లడించారు. విగ్రహాన్ని తయారు చేసే సమయంలో ఓ కోతి తప్పకుండా ఆ ప్రాంతంలోకి వచ్చేదని తెలిపారు.