kedarnath helicopter crashes: కేదార్నాథ్ హెలికాప్టర్ ప్రమాదం.. చిన్నారి సహా ఏడుగురు మృతి

Published : Jun 15, 2025, 05:02 PM IST
Kedarnath travel safety tips

సారాంశం

kedarnath helicopter crashes: ఉత్తరాఖండ్‌లో కేదార్నాథ్ నుంచి గుప్తకాశికి వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. చనిపోయిన వారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు.

kedarnath helicopter crashes: ఉత్తర భారతంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదార్నాథ్ వద్ద ఆదివారం ఉదయం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. కేదార్నాథ్ నుంచి గుప్తకాశికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నారు.

కేదార్నాథ్ హెలికాప్టర్ ప్రమాదం వివరాలు

ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆదివారం ఉదయం 5:30 గంటల సమయంలో కేదార్నాథ్ నుండి గుప్తకాశికి బయలుదేరిన హెలికాప్టర్ కొద్దిసేపటికే కుప్పకూలింది. ప్రమాదానికి కారణం ప్రతికూల వాతావరణ పరిస్థితులేనని భావిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది.

కేదార్నాథ్ హెలికాప్టర్ ప్రమాదం మృతుల వివరాలు

ఈ హెలికాప్టర్‌లో మొత్తం ఏడుగురు ఉన్నారు. అందరూ ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. చనిపోయిన వారిలో..

• పైలట్ లెఫ్టినెంట్ కర్నల్ రాజవీర్ సింగ్ చౌహాన్ (37), జైపూర్ నివాసి

• విక్రమ్ రావత్ (46), రుద్రప్రయాగ్

• వినోద్ దేవ్ (66), బిజ్నోర్, ఉత్తరప్రదేశ్

• తుష్టి సింగ్ (29), బిజ్నోర్

• రాజ్‌కుమార్ సురేశ్ జైస్వాల్ (41), మహారాష్ట్ర

• శ్రద్ధా జైస్వాల్ (35), మహారాష్ట్ర

• కాశి (2), శ్రద్ధా-రాజ్‌కుమార్ కుమార్తె

హెలికాప్టర్ కూలిన వెంటనే భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శవాలు పూర్తిగా కాలిపోయినట్టు అధికారులు తెలిపారు. సంఘటనా స్థలం అడవులతో నిండి ఉండటంతో రక్షణ చర్యలు సవాలుగా మారాయి. రాష్ట్ర విపత్తు స్పందన బలగాలు (SDRF), స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

నిలిచిపోయిన హెలికాప్టర్ సేవలు

హెలికాప్టర్ కూలిపోయిన నేపథ్యంలో చార్ ధామ్ యాత్ర హెలికాప్టర్ సేవలను రెండు రోజుల పాటు నిలిపివేయనున్నట్టు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ప్రయాణికుల భద్రత రాష్ట్రానికి మొదటి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.

ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా ఘాట్ ప్రాంతాలలో ఒక్కసారిగా మారిన వాతావరణం, దట్టమైన మేఘాలు, ఎత్తయిన ప్రాంతాల్లో విమాన సర్వీసుల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లుగా ఉన్నాయని అన్నారు. ఈ ప్రమాదం చార్ ధామ్ మార్గంలో గత 40 రోజులలో నమోదైన ఐదవ హెలికాప్టర్ ప్రమాదం కావడం గమనార్హం. జూన్ 7న కూడా కేదార్నాథ్ వ్యాలీలో ఒక హెలికాప్టర్ అత్యవసరంగా రోడ్డుపై ల్యాండ్ చేయాల్సి వచ్చింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu
LPG New Rules : గ్యాస్ బుకింగ్‌పై కొత్త రూల్స్..? మే 1 నుంచి కీలక మార్పులు..!