తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

Operation Sindoor: గుజరాత్‌లో హై అలర్ట్‌.. తీర ప్రాంతాలు, సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం

Mahesh Rajamoni | Published : May 8, 2025 2:21 AM

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ తర్వాత గుజరాత్‌లో తీరప్రాంతాలు, విమానాశ్రయాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మాక్ డ్రిల్లులు నిర్వహణతో పాటు హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. 

Operation Sindoor: భారత త్రివిధ దళాలు బుధవారం తెల్లవారుఝామున "ఆపరేషన్ సింధూర్" క్రింద పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై క్షిపణి దాడులు జ‌రిపిన త‌ర్వాత ఉద్రిక్త‌త‌లు మ‌రింత పెరిగాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలు, తీరప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పెంచిన‌ట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

తీరప్రాంతాలైన జామ్‌నగర్, హాలార్ బీచ్ తదితర ప్రాంతాల్లో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG), మెరైన్ పోలీస్, టాస్క్ ఫోర్స్ కమాండోలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పాక్ సరిహద్దుకు సమీపంలో ఉన్న హాలార్ బీచ్‌లో నిఘా కట్టుదిట్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుజరాత్ వ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్‌ను గుజరాత్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పంకజ్ జోషీ గాంధీనగర్‌లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC) నుండి వర్చువల్‌గా పర్యవేక్షించారు. జిల్లాల విభాగాలు అత్యవసర పరిస్థితులకు ఎంతమేర సన్నద్ధంగా ఉన్నాయో అంచనా వేయడం ఈ డ్రిల్ ఉద్దేశం.

ఈ సమీక్ష సమావేశంలో రెవెన్యూ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయంతి రవి, సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ మనోజ్ అగర్వాల్, రవాణా కమిషనర్ అనుపమ్ ఆనంద్, రిలీఫ్ కమిషనర్ ఆలోక్ కుమార్ పాండే పాల్గొన్నారు. జామ్‌నగర్ విమానాశ్రయంలో జిల్లా పోలీసుల పర్యవేక్షణలో కార్లు, ప్రయాణికుల సోదాలు కొనసాగుతున్నాయి. జామ్‌నగర్ నుంచి ముంబయికి మధ్య సేవలు తదుపరి మూడు రోజులు నిలిపివేశారు. భుజ్, రాజ్‌కోట్, జోధ్‌పూర్, అమృత్‌సర్ వంటి ప్రధాన నగరాలకు రాకపోకలు కూడా తాత్కాలికంగా నిలిచిపోయాయి.

నర్మదా డ్యామ్ వద్ద భద్రతా సన్నద్ధతను సమీక్షించేందుకు సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ అమిత్ అరోరా అధ్యక్షతన సమావేశం జరిగింది. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలలో అంతరాయం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎకతానగర్‌లోని స్టేట్ రిజర్వ్ ఫోర్స్ 24 గంటల పాటు నర్మదా డ్యామ్ చుట్టూ నిఘా కొనసాగిస్తోంది. జామ్‌నగర్‌లో ఫైర్ డిపార్ట్‌మెంట్ నాలుగు జోన్‌లలో మాక్ డ్రిల్లులు నిర్వహించారు. 100కి పైగా సిబ్బంది, 30 ఫైర్ ఇంజిన్లు ఇందులో పాల్గొన్నాయి. చీఫ్ ఫైర్ ఆఫీసర్ కె.కె. బిష్ణోయ్ స్టేషన్ అధికారులతో ముందస్తు సమీక్ష నిర్వహించారు.

జిల్లా ఎస్పీ ప్రేమ్‌సుఖ్ డేలు ఆధ్వర్యంలో పోలీస్ శాఖ సమీక్ష సమావేశం నిర్వహించి, శాంతిభద్రతలు, విభాగాల మధ్య సమన్వయం పెంపు పై దృష్టి పెట్టారు. అహ్మదాబాద్, సూరత్, వడోదర, గాంధీనగర్ వంటి నగరాల్లో పోలీసు, పారామిలటరీ బలగాల మోహరింపు పెంచారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రముఖ మతస్థలాలు, నరేంద్ర మోడీ స్టేడియం వంటి ప్రాంతాల్లో భద్రతా తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతున్నాయి.
 

Read more Articles on
click me!