శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలవాలని, గౌహతికి వెళ్లాలని తనను సంప్రదించారని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పిన ఆయన రాష్ట్రంలో వ్యవసాయం, నిరుద్యోగం సమస్యలను తొలగించాలని సూచించారు.
తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ఉండాలని, గౌహతికి రావాలని తనకు ఆఫర్ వచ్చిందని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. అయితే తాను దానికి ఒప్పుకోలేదని చెప్పారు. ఈ విషయాన్ని ఆయన మీడియా సమావేశంలో శనివారం వెల్లడించారు. ‘‘ నాకు కూడా గౌహతి వెళ్లాలని ఆఫర్ వచ్చింది, కానీ నేను బాలాసాహెబ్ ఠాక్రే అడుగుజాడల్లో నడిచే వ్యక్తిని. అందుకే నేను అటు వైపు వెళ్లలేదు. నిజం మనవైపు ఉన్నప్పుడు ఎందుకు భయపడాలని ? ’’ అని అన్నారు.
మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, అయితే పార్టీని చీల్చి ఇది ఏర్పాటు చేసిందని చెప్పారు. 2019 సంవత్సరంలో బీజేపీ తన మాటకు కట్టుబడి ఉంటే రెండున్నర సంవత్సరాల పాటు ఆ పార్టీ వ్యక్తే సీఎంగా ఉండేవారని అన్నారు. తమ పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేదే కాదని, అసలు మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రయోగమే జరిగేది కాదని అన్నారు.
ఇప్పుడు ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీజేపీ ఏం సాధించిందని రౌత్ ప్రశ్నించారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో తమ పార్టీని విస్తరించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. సేన నుంచి విడిపోయిన ఓ వర్గం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అన్నారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ పై విరుచుకుపడ్డారు. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం శివసేన-బీజేపీ ప్రభుత్వమా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. శివసేనను చీల్చలనే షిండే ఎత్తుగడ తమ పార్టీని బలహీన పర్చిందని సంజయ్ రౌత్ నొక్కి చెప్పారు.
ఉదయ్పూర్ తర్వాత మహారాష్ట్రలో మరో మర్డర్.. నుపుర్ శర్మపై సోషల్ మీడియాలో పోస్టు వల్లే?
ఈ సందర్భంగా కొత్ ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శివసేనలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన షిండే, ఫడ్నవీస్ లు కలిసి వ్యవసాయం, నిరుద్యోగానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అలా చేసేటప్పుడు పరిపాలన, పోలీసు యంత్రాంగం ఎలాంటి పక్షపాతమూ లేకుండా పనిచేసేలా చూడాలని ఆయన అన్నారు. ఈ దేశంలోని ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, దేశంలోని ఏదైనా దర్యాప్తు సంస్థ తనను పిలిచినప్పుడు వెళ్తానని చెప్పారు. వారి ముందుకు వెళ్లి సమాధానం ఇస్తానని అన్నారు. ఇది రాజకీయ ఒత్తిడితో జరిగిందని ప్రజల మనస్సులలో కొంత సందేహం ఉందని, కానీ అలాంటిదేమీ లేదని అన్నారు.
Udaipur: ఉదయ్ పూర్ హత్య నిందితుల్లో ఒకరు బీజేపీ మెంబర్.. : కాంగ్రెస్
కాగా.. మనీలాండరింగ్ కేసులో స్టేట్ మెంట్ ను రికార్డ్ చేయడానికి సంజయ్ రౌత్ శుక్రవారం ED ముందు హాజరయ్యారు. దాదాపు 10 గంటల పాటు ఆయన ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. ‘‘ నేను వారితో 10 గంటలు ఉన్నాను. అధికారులు నాతో చాలా చక్కగా వ్యవహరించారు. నేను అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చాను. నన్ను మళ్లీ ఎప్పుడు పిలిచినా వస్తానని నేను వారికి చెప్పాను ’’ అని అన్నారు. ముంబైలోని ‘చాల్’ రీడెవలప్మెంట్, రౌత్ భార్య, స్నేహితుల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఈడీ ఆయనను ప్రశ్నిస్తోంది.