Success story: ఇది క‌దా స‌క్సెస్ అంటే.. గొర్రెల కాప‌రి కుర్రాడు UPSC కొట్టేశాడు

Narender VaitlaPublished : May 18, 2025 11:50 AM

కర్ణాటకలోని ఓ గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన బిర్దేవ్ సిద్ధప్ప ధోనె అనే యువకుడు తన కష్టంతో, పట్టుదలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఏప్రిల్ 22న విడుదలైన UPSC ఫలితాల్లో ఆల్ ఇండియా ర్యాంక్ 551 సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచాడు. ఇది అతనికి మూడవ ప్రయత్నం. ప్రస్తుతం అతనికి వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే.  

ఫ‌లితాలు వ‌చ్చిన స‌మ‌యంలో ధోనె త‌న బందువుల‌తో గోర్ల‌ను కాస్తున్నాడు. ఈ విష‌యం తెలిసిన వెంటనే, అతని మామ గుడ్డె కట్టిన పసుపు పట్టు తలపై కట్టి, నుదిటిపై పసుపు పెట్టి అతని విజయాన్ని సంబరంగా జరుపుకున్నారు. ఆ స‌మ‌యంలో తీసిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. 

ధోనె మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా, కాగల్ తాలూకాలోని యామగే గ్రామంకు చెందినవాడు. ధంగర్ వర్గానికి చెందిన ఇతని కుటుంబం తరతరాలుగా గొర్రెలు, మేకల పెంపకాన్ని జీవనాధారంగా చేసుకుంది. కుటుంబం దగ్గర కేవలం ఒక ఎకరా భూమి మాత్రమే ఉంది. అతని అన్న భారత సైన్యంలో సేవలు అందిస్తున్నారు.

తన విద్యాభ్యాసాన్ని కూడా చాలా సాధారణ స్థాయిలోనే కొనసాగించాడు. 10వ తరగతి వరకు ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో చదివాడు. 11వ, 12వ తరగతులు 'జై మహారాష్ట్ర హై స్కూల్'లో పూర్తి చేశాడు. తరువాత పుణేలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ పొందాడు.

2020–21లో అతడు కొంతకాలం ఇండియా పోస్టులో పోస్ట్ మ్యాన్‌గా పనిచేశాడు. కానీ, UPSC వైపు ఆకర్షణ తగ్గలేదు. తన ఉద్యోగం వదిలేసి, పూర్తి సమయం UPSC ప్రిపరేషన్ కోసం ఢిల్లీకి వెళ్ళాడు. ఆ సమయంలో అతని స్నేహితుడు అతన్ని ఆర్థికంగా ఆదుకున్నాడు. 

“సివిల్ సర్వీసెస్ లోకి రావాలన్న కల చిన్నప్పటి నుంచే ఉంది. ఏ స్థాయిలో కష్టం వస్తుందో తెలుసు, కానీ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాను,” అని ధోనె చెప్పాడు. అతని లక్ష్యం IAS అధికారిగా సేవ చేయడం. “ఇంతటి ఘనత నాకు దక్కిందనే నిజం ఇంకా నమ్మలేకపోతున్నాను. ఇది కలలా ఉంది,” అంటూ చెప్పుకొచ్చాడు.

Read more Articles on
click me!