శ్రీన‌గ‌ర్‌లో తిరిగి మొద‌లైన విమాన సేవ‌లు.. ప‌ర్యాట‌కుల‌ను ఆహ్వానించిన కేంద్ర మంత్రి

Narender VaitlaUpdated : May 15 2025, 02:29 PM IST

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత జ‌మ్ముక‌శ్మీర్‌లో ఒక్క‌సారిగా ప‌రిస్థితులు మారిపోయిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి వ‌ర‌కు ప‌ర్యాట‌కుల‌తో ర‌ద్దీగా ఉన్న జ‌మ్ము ఉగ్ర‌వాదుల దుశ్చ‌ర్య‌తో నిర్మానుష్యంగా మారింది. ఆ త‌ర్వాత భార‌త్‌, పాక్‌ల మ‌ధ్య ఉద్రిక్త‌ల‌తో విమాన సేవ‌లు కూడా నిలిచిపోయాయి. అయితే తాజాగా జ‌మ్ములో మ‌ళ్లీ ప‌రిస్థితులు మెరుగువుతున్నాయి.   

శ్రీనగర్ విమానాశ్రయానికి అన్ని విమానాల రాకపోకలు పూర్తిగా పునరుద్ధరించినట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు గురువారం వెల్లడించారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు కాశ్మీర్‌కు వచ్చి సందర్శించాలని ఆయన పిలుపునిచ్చారు.

మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. "డిల్లీ, ముంబయి సహా అన్ని విమాన మార్గాలను మళ్లీ ప్రారంభించాం. ఇవి మే 15 నుంచి అమలులోకి వచ్చాయి. పర్యాటకం, ఆర్థిక వ్యవస్థ, వ్యాపార రంగాల్లో ఇక్కడి ప్రజలు కొంత కష్టాన్ని ఎదుర్కొంటున్నారు. కశ్మీర్ ఇప్పుడు సురక్షితంగా ఉంది. ప్రజలు మళ్లీ ఇక్కడికి రావాలి. కశ్మీర్ ఆర్థిక వ్యవస్థను అంద‌రం కలిసి నిలబెట్టాలి," అని చెప్పుకొచ్చారు.

శ్రీనగర్ విమానాశ్రయంలో విమాన సేవలు తిరిగి ప్రారంభమైనట్టు ఆయన చెప్పారు. "ఇక్కడి స్థానికుల్ని కలిశాను. వారు పర్యాటకాన్ని ప్రోత్సహించాలని కోరారు. ప్రభుత్వం దీనికి సంబంధించిన అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 

అలాగే, పహల్గాం ఘటనకు ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైనందుకు సైన్యాన్ని ప్రశంసించారు. “ఉగ్రవాద శిబిరాలపై జరిగిన దాడులు విజ‌య‌వంత‌మ‌య్యాయి. పాకిస్తాన్‌లోని సాధారణ ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా దాడులు చేయడం గర్వకారణం," అని చెప్పారు.

గత మూడు వారాలుగా శ్రీనగర్ సహా కొన్ని విమానాశ్రయాలను భద్రత కారణంగా తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పరిస్థితి చక్కదిద్దుకున్న నేపథ్యంలో, మంత్రి స్వయంగా శ్రీనగర్ వెళ్లి అక్కడి అధికారులు, సిబ్బందిని కలుసుకుని వారి ధైర్యాన్ని మెచ్చుకున్నారు.

Read more Articles on
click me!