
ఉత్తరప్రదేశ్లోని రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో సోమవారం ఓ కోచింగ్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 14 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. భవనంలో చిక్కుకుపోయిన పలువురు విద్యార్థులు ప్రాణాలను కాపాడుకోవడానికి మొదటి అంతస్తు నుంచి కిందకు దూకాల్సి వచ్చిందని తెలిపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం కారణంగా భవనంలో దట్టమైన పొగలు వ్యాపించడంతో లోపల ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. కొందరు విద్యార్థులు ప్రాణాలను కాపాడుకోవడానికి బాల్కనీలు, పైకప్పుల నుంచి కూడా దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. 14 అగ్నిమాపక యంత్రాలు, ఒక హైడ్రాలిక్ ప్లాట్ఫారమ్ వాహనంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. స్థానిక పోలీసులు కూడా వెంటనే చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 14 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులను సురక్షితంగా రక్షించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, డీజీ ఫైర్, లక్నో డీఎం సంఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంటలు ఒక దుకాణంలో ప్రారంభమై, ఆపై కోచింగ్ సెంటర్కు వ్యాపించాయని ప్రాథమికంగా తెలుస్తోంది. భవనంలో అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించారా లేదా అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.