PM Modi met Rampal Kashyap: ప్రధాని నరేంద్ర మోడీ రాంపాల్ కశ్యప్ను కలిశారు. అంతకుముందు, పీఎం మోడీ ప్రధాని అయి, తనను కలిసే వరకు చెప్పులు వేసుకోనని 14 ఏళ్ల కిందట కైతల్కు చెందిన రాంపాల్ కశ్యప్ ప్రతిజ్ఞ చేశారు.
PM Modi met Rampal Kashyap: హర్యానాలో సోమవారం ఒక ప్రత్యేకమైన, ఎమోషనల్ సంఘటన చోటుచేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలవడానికి 14 ఏళ్లుగా చెప్పులు లేకుండా నడిచిన కైతల్కు చెందిన రాంపాల్ కశ్యప్కు తన జీవితంలోనే అతిపెద్ద సంతోషం దక్కింది. పీఎం మోడీ ఆయనను కలవడమే కాకుండా స్వయంగా తన చేతులతో ఆయనకు చెప్పులు తొడిగి ఒక చారిత్రాత్మకమైన, భావోద్వేగమైన క్షణాన్ని సృష్టించారు.
హర్యానాలోని కైతల్ జిల్లాకు చెందిన రాంపాల్ కశ్యప్ 2009లో ఒక ప్రతిజ్ఞ చేశారు. నరేంద్ర మోడీ లాంటి నాయకుడే దేశ భవిష్యత్తును మార్చగలరని ఆయన నమ్మారు. మోడీ దేశానికి ప్రధానమంత్రి కానంత వరకు, తాను వ్యక్తిగతంగా ఆయనను కలవనంత వరకు చెప్పులు వేసుకోకూడదని అదే సంవత్సరం ఆయన నిర్ణయించుకున్నారు. ఈ ప్రతిజ్ఞ తర్వాత రాంపాల్ కశ్యప్ 14 ఏళ్ల పాటు ఎటువంటి చెప్పులు లేకుండా నడిచారు. చలి, ఎండా, వాన ఏదైనా సరే రాంపాల్ గారి దీక్షను ఏ కాలమూ ఆపలేకపోయింది.
ప్రధానమంత్రి మోడీ హర్యానా పర్యటనలో రాంపాల్ కశ్యప్ను వేదికపైకి పిలిచారు. దేశంలోని మీడియా, ప్రజల సమక్షంలో మోడీ స్వయంగా వంగి ఆయనకు చెప్పులు తొడిగారు. ఆ సమయంలో వేదికపై ఉన్న ప్రజలు కూడా భావోద్వేగానికి గురయ్యారు. పీఎం మోడీ కూడా ఆ క్షణం ఎమోషనల్ అయ్యారు. రాంపాల్ కశ్యప్ అయితే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
సమావేశం తరువాత పీఎం మోడీ మాట్లాడుతూ రాంపాల్ ఈ సంకల్పం కేవలం నా కోసమే కాదు, దేశాన్ని ఒక కొత్త దిశలో నడిపించాలనుకునే ప్రజల భావాల శక్తి ఇది అన్నారు. 14 సంవత్సరాలు చెప్పులు లేకుండా నడవడం అంటే చిన్న విషయం కాదు, ఇది త్యాగానికి, చెక్కుచెదరని నమ్మకానికి నిదర్శమని అన్నారు.