ఎన్నికల కమిషనర్ రాజీనామా.. లోక్ సభ ఎన్నికలకు ముందు అనూహ్య పరిణామం..

By Sairam IndurFirst Published Mar 9, 2024, 9:48 PM IST
Highlights

కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ (Arun Goel) రాజీనామా చేశారు. కీలకమైన లోక్ సభ ఎన్నికలకు మరి కొద్ది రోజులే సమయం ఉన్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. గోయల్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు.

Arun Goel : లోక్ సభ ఎన్నికలకు ఇంకా మరికొన్ని రోజులే ఉన్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అయితే ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక ఖాళీ ఉండగా.. ఈ రాజీనామాతో మరో ఖాళీ ఏర్పడింది. కేంద్ర ఎన్నికల కమిషన్ లో ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలి ఉన్నారు.

ఎన్డీఏలోకి టీడీపీ, జనసేనలకు స్వాగతం - బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

వచ్చే వారం లోక్ సభ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో అరుణ్ గోయల్ రాజీనామా చేయడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. వాస్తవానికి ఎన్నికల కమిషనర్ గా ఆయన పదవి కాలం మరో మూడేళ్లు ఉంది. కానీ ఈలోపే ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. 

President accepts the resignation tendered by Arun Goel, Election Commissioner with effect from the 9th March 2024: Ministry of Law & Justice pic.twitter.com/88tuyXm4uP

— ANI (@ANI)

1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గోయల్ 2022 నవంబర్ 18న స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అయితే మరుసటి రోజే ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం హడావిడిగా ఆయనను నియమించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. ఈ పిటిషన్ ను ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం గతేడాది కొట్టివేసింది. 

హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటే.. నగర బహిష్కరణే - సీఎం రేవంత్ రెడ్డి

రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలించిందని, అయితే గోయల్ నియామకాన్ని రద్దు చేయడానికి నిరాకరించిందని పేర్కొంది. కాగా.. ఫిబ్రవరిలో మరో ఎన్నికల కమిషనర్ అనూప్ పాండే పదవీ విరమణ పొందారు. ఇప్పుడు గోయల్ కూడా రాజీనామా చేయడంతో త్రిసభ్య ఈసీ ప్యానెల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉన్నారు. అయితే గోయల్ రాజీనామాకు కారణం ఏంటో తెలియరాలేదు.

click me!