
Delhi High Court Bomb Threat : దేశ రాజధాని న్యూడిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ప్రధాని, రాష్ట్రపతి వంటి పొలిటికల్ విఐపిలు నివాసముండే డిల్లీలో బాంబు పెట్టినట్లు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. డిల్లీ హైకోర్టు ప్రాంగణంలో బారీగా పేలుడు పదార్ధాలు పెట్టినట్లు... ఏ క్షణమైనా అవి పేలవచ్చంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుండి మెయిల్ వచ్చింది. దీంతో వెంటనే కోర్టు కార్యకలాపాలను నిలిపివేసి అందరినీ బయటకు పంపించారు. బాంబ్ స్క్వాడ్ తో పాటు పోలీస్ జాగిలాలతో హైకోర్ట్ భవనం మొత్తం తనిఖీలు చేపట్టారు.
డిల్లీ హైకోర్టు ప్రాంగణంలో భారీ పేలుడు పదార్థాలతో కూడిన మూడు బాంబులు పెట్టినట్లు మెయిల్ లో పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆ బాంబులు పేలతాయని బెదిరించారు. ఇది ఐఎస్ఐఎస్ పనిగా మెయిల్ లో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు న్యాయస్థానం పరిసరాల్లో ఎలాంటి బాంబు లభించలేదు... అయినా కోర్టు సిబ్బంది ఇంకా బయటే ఉన్నారు... కార్యకలాపాలు ప్రారంభంకాలేదు.
ఇటీవలకాలంలో బాంబు బెదిరింపులు పెరిగిపోయాయి... విమానాశ్రయాలు, స్కూళ్లకు ఇలాంటి బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు కోర్టులకు కూడా బెదిరింపులు ఎదురవుతున్నాయి. బాంబు బెదిరింపుల కారణంగా డిల్లీ హైకోర్టు సమయమంతా వృధా అయ్యింది.