
కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజాలకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం సమన్లు పంపించింది. ఇటీవల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్ నేపథ్యంలో హైకోర్టు ఈ చర్యకు పూనుకుంది. ఆమె తన పిటిషన్ లో తనపై, తన కుమార్తెపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారని పేర్కొంటూ రూ.2 కోట్లకు పైగా నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ సివిల్ పరువునష్టం దావా వేశారు.
స్కూల్లో.. దెయ్యంపట్టినట్టుగా విద్యార్థినుల అరుపులు,కేకలు.. విచిత్ర ప్రవర్తన.. అదిరిపోయిన టీచర్లు..
దీనిపై స్పందించిన హైకోర్టు.. మహిళా శిశు సంక్షేమ శాఖ, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రిగా ఉన్న ఇరానీ, ఆమె కుమార్తెపై చేసిన ఆరోపణలకు సంబంధించి సోషల్ మీడియా నుండి ట్వీట్లు, రీట్వీట్లు, పోస్టులు, వీడియోలు, ఫోటోలను తొలగించాలని జస్టిస్ మినీ పుష్కర్న ముగ్గురు కాంగ్రెస్ నాయకులను ఆదేశించారు. ప్రతివాదులు 24 గంటల్లోగా తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైతే, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ ఆ కంటెంట్ ను తొలగించాలని కోర్టు తెలిపింది.
అసలేం జరిగిందంటే ?
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్మృతి ఇరానీ కూతురుపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె 18 ఏళ్ల కుమార్తె జోయిష్ ఇరానీ గోవాలో అక్రమంగా బార్ నడుపుతున్నారని అన్నారు. ఇది సంచలనం సృష్టించింది. దీనిపై కేంద్ర మంత్రి ఇరానీ ఆ సమయంలోనే స్పందించారు. తన కూతురుపై వస్తున్న ఆరోపణలన్నింటినీ ఆమె ఖండించారు. తన కుమార్తె కాలేజీ విద్యార్థిని అని ఆమె ఎలాంటి బార్ను నిర్వహించడం లేదని ఇరానీ చెప్పారు. 18 ఏళ్ల బాలిక తల్లి గౌరవాన్ని కాంగ్రెస్ దిగజార్చిందని విమర్శించారు. 2014, 2019లో రాహుల్ గాంధీపై అమేథీ నుంచి పోటీ చేయడమే తను చేసిన తప్పా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ తన కుమార్తె వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారనీ, ఏదైనా తప్పు చేసినట్లయితే రుజువు చేయాలని అన్నారు. 2024లో మళ్లీ అమేథీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు రాహుల్ గాంధీకి ధైర్యం లేదని అన్నారు. రాహుల్ గాంధీ మళ్లీ ఓడిపోతాడని, తాను హామీ ఇస్తున్నానని మంత్రి ఇరానీ అన్నారు. అనంతరం ఈ అంశంపై ఆమె కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపించారు. తన కూతురుపై చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. అనంతరం ఢిల్లీ హైకోర్టులో సివిల్ పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయా నాయకులకు కోర్టు సమన్లు పంపించింది.