భారత్‌లో పిల్లలకు ఏ వ్యాక్సిన్ వేస్తారు?.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది?.. ఇక్కడ తెలుసుకోండి

By Sumanth KanukulaFirst Published Dec 26, 2021, 5:25 PM IST
Highlights

జనవరి 3 నుంచి 15 -18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ డ్రైవ్‌ను (vaccine for children) ప్రారంభించనున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) శనివారం రోజున వెల్లడించిన సంగతి తెలిసిందే. మోదీ ప్రకటన తర్వాత పిల్లలు తల్లిదండ్రుల్లో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పిల్లలకు ఏ టీకా వేయించాలి?, రిజిస్ట్రేషన్‌ ఎలా జరుగుతుంది? వంటి ప్రశ్నలు వెంటాడుతున్నాయి. మరి వాటి గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

జనవరి 3 నుంచి 15 -18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ డ్రైవ్‌ను (vaccine for children) ప్రారంభించనున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) శనివారం రోజున వెల్లడించిన సంగతి తెలిసిందే. కరోనా కొత్త వేరియంట్‌ వ్యాప్తి చెందుతున్న వేళ ప్రధాని మోదీ ఈ రకమైన ప్రకటన చేశారు. అయితే ప్రధాని మోదీ తన ప్రసంగంలో పిల్లలకు ఏ వ్యాక్సిన్ అందజేయనున్నారనే విషయాలను ప్రస్తావించలేదు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ప్రకటన తర్వాత 15 నుంచి 18 వయసు గల పిల్లలు ఉన్న తల్లిదండ్రుల్లో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పిల్లలకు ఏ టీకా వేయించాలి?, రిజిస్ట్రేషన్‌ ఎలా జరుగుతుంది?, వ్యాక్సిన్‌ డోసులు ఎంత వ్యవధిలో వేయించాలి? అనే ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతున్నాయి.. అయితే ఇందుకు నిపుణులు నుంచి వినిపిస్తున్న సమాధానాలను ఒకసారి చూద్దాం.

పిల్లలకు సంబంధించి డీసీజీఐ.. కోవాగ్జిన్ టీకాకు అత్యవసర వినియోగానికి ఆమోదించిన సంగతి తెలిసిందే. 12 నుంచి 18 ఏళ్లలోపు వారికి అత్యవసర వినియోగానికి ఈ టీకాకు అనుమతించింది. అయితే 12 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే చిన్నారులకు వ్యాక్సిన్ డోసుల కోసం భారత్‌ బయోటెక్‌ను కేంద్రం ఆదేశించినట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే వ్యాక్సిన్ ఎన్ని దశల్లో వేయనున్నారు..? ఎవరికి ముందుగా ప్రాధాన్యత ఇస్తారు..? అనే అంశాలపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం అనుసరించే వ్యుహాల ఆధారంగానే నిర్ణయాలు జరుగుతాయి. 

అయితే ముందుగా.. పిల్లలకు జైడస్ కాడిలా వ్యాక్సిన్‌పై ఆలోచనలు కూడా జరిగాయి. ఆ వ్యాక్సిన్‌ను మూడు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఆ వ్యాక్సిన్‌లో సిరంజిలు ఉపయోగించరు. ప్రస్తుతానికి, అత్యవసర ఉపయోగం కోసం ప్రభుత్వం కోవాక్సిన్‌ను ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 

రిజిస్ట్రేషన్ ఎలా?
ప్రస్తుతం దేశంలో ఉన్న విధానం ప్రకారం కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్లాట్‌ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి, పిల్లలకు టీకాలు వేయడం గురించి ఎటువంటి విధానాన్ని స్పష్టం చేయలేదు. యాప్‌లో స్లాట్ బుకింగ్ సమయంలో ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వాలి. ఆధార్ కార్డు లేని పిల్లలు చాలా మంది ఉన్నారు. పిల్లల కోసం ప్రత్యేక  విధానాన్ని కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పిల్లలకు వారి ఇంటి వద్ద లేదా పాఠశాలకు వెళ్లి పిల్లలకు టీకాలు వేసే అవకాశం ఉంది.

వ్యాక్సిన్‌ డోస్‌ల మధ్య గ్యాప్ ఎలా..?
18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య 90 రోజుల వరకు గ్యాప్ ఇవ్వబడింది. అయితే మధ్యలో తగ్గింది. అయితే కేంద్రం జనవరి 3 నుంచి పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం తొలుత ఒక డోస్ తీసుకున్నప్పటికీ పిల్లలకు చాలా వరకు ఇన్ఫెక్షన్ నుండి రక్షించబడతారు. అయితే పెద్దవారిలో మాదిరిగా పిల్లలకు 90 రోజుల గ్యాప్ ఉండకపొవచ్చని అంటున్నారు. 

పిల్లలకు టీకా ఖర్చు ఎంత?
ప్రస్తుతం దేశంలో ఉచితంగా టీకాలు వేసే విధానం ఉంది. కొంత మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలను సందర్శించి వ్యాక్సిన్‌ను పొందుతుండగా, మరికొంత మంది ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో డబ్బులు చెల్లించి వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు కూడా రెండు ఏర్పాట్లు ఉండే అవకాశం ఉంది.

బూస్టర్ డోస్, ప్రికాషస్ డోస్(ముందు జాగ్రత్త డోసు) అంటే ఏమిటి?
ఓమిక్రాన్‌లో బూస్టర్ డోస్‌పై తీవ్రమైన మేధోమథనం ఉంది. శనివారం సాయంత్రం దేశాన్ని ఉద్దేశించి ప్రసగించిన ప్రధాని మోదీ.. 'బూస్టర్ డోస్'కి బదులుగా 'ప్రికాషస్ డోస్' అనే పదాన్ని ఉపయోగించారు. దీంతో బూస్టర్ డోసు, ప్రికాషస్ డోస్ రెండు ఒకటేనా అనే ప్రశ్న కూడా మొదలైంది. ప్రధాని ప్రసంగం అనంతరం దేశంలోని ప్రముఖ వైద్యుడు నరేష్ ట్రెహాన్ మాట్లాడుతూ.. మోదీ బూస్టర్ డోస్‌ను నివారణ డోస్‌గా మాత్రమే పిలిచారని అన్నారు. రోగనిరోధక శక్తిని పెంచడం దీని ప్రధాన ఉద్దేశ్యం.

పిల్లల వ్యాక్సిన్, వృద్ధుల బూస్టర్ డోస్ గురించి మోదీ ఏం చెప్పారంటే..
దేశంలో 15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి దీన్ని ప్రారంభించనున్నట్టుగా చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పాఠశాలలు మరియు కళాశాలలకు వెళ్లే విద్యార్థులందరికీ కరోనా నుండి రక్షణ లభిస్తుంది. 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు వేయడం వల్ల 10-12వ తరగతి విద్యార్థులు ఆందోళన లేకుండా పరీక్ష రాయగలుగుతారు.

హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కూడా వ్యాక్సిన్ ప్రికాషస్ డోస్ ఇవ్వబడుతుందని ప్రధాని మోదీ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి ఇది ప్రారంభం కానుందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులు దేశాన్ని సురక్షితంగా ఉంచారని ప్రధాన మంత్రి అన్నారు. వారి అంకితభావం సాటిలేనిదని కొనియాడారు.. వారు ఇప్పటికీ కోవిడ్ రోగులకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. 

click me!