
యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్తో సమావేశమయ్యారు.. దీంతో పాటు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలను కూడా ఆయన సందర్శించారు. ఇది కాకుండా క్రాఫ్ట్ మ్యూజియం , లోధి ఆర్ట్ డిస్ట్రిక్ట్ను కూడా టిమ్ కుక్ సందర్శించారు. యాపిల్ సీఈవో టిమ్ కుక్తో భేటీ అనంతరం కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేస్తూ యాపిల్ సీఈవో , ఆయన బృందం భారతదేశ డిజిటల్ ప్రయాణానికి మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఆపిల్తో వ్యూహాత్మక , దీర్ఘకాలిక భాగస్వామ్యంతో పనిచేస్తామని రాజీవ్ చెప్పారు. తయారీ, ఎగుమతులు, యువత నైపుణ్యాభివృద్ధి, యాప్, ఇన్నోవేషన్ ఎకానమీ వంటి అంశాలపై కూడా వివరంగా చర్చించామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దీనితో పాటు ఉపాధి కల్పనపై కూడా విస్తృతంగా చర్చించినట్లు రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
ఇకపోతే.. అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ భారత్లో తొలి రిటైల్ స్టోర్ను ఏప్రిల్ 18న ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ముంబై బీకేసీ (బాంద్రా కుర్లా కాంప్లెక్స్)లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో దీనిని కంపెనీ సీఈవో టిమ్ ప్రారంభించారు. దీనిని యాపిల్ బీకేసీగా పిలుస్తున్నారు. ఈ స్టోర్కు నెల అద్దె రూ.42 లక్షలు (ఏడాదికి రూ.5.04 కోట్లు). అంతేకాదు ప్రతి మూడేళ్లకు ఒకసారి 15 శాతం చొప్పున అద్దెను పెంచుతారు.
ఇదిలావుండగా.. తన బిజీ షెడ్యూల్లో హైదరాబాద్కు కూడా వచ్చారు టిమ్ కుక్. ఇక్కడి పుల్లెల గోపీచంద్ అకాడమికి వెళ్లిన ఆయన.. భారత క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, చిరాగ్ శెట్టి, పారుపల్లి కశ్యప్లతో ముచ్చటించి.. అక్కడ శిక్షణ పొందుతున్న చిన్నారులతోనూ మాట్లాడారు. ఈ సందర్భంగా టిమ్ కుక్ కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. దీనికి సంబంధించిన వివరాలను టిమ్ కుక్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. అంతకుముందు యాపిల్ స్టోర్ను ప్రారంభించిన తర్వాత ఆయన బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్తో కలిసి మరాఠీల ఫేవరేట్ వంటకం వడపావ్ రుచిచూశారు.