
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి (France Defence Minister) ఫ్లోరెన్స్ పార్లీ ఇటీవలే భారత్(India)లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఆమె రాఫేల్ జెట్ల (Rafale Fighter Jets) పైనా వ్యాఖ్యలు చేశారు. భారత్కు కావాలనుకుంటే మరిన్ని యుద్ధ విమానాలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె వెల్లడించారు. ఆమె భారత పర్యటన తర్వాతే భారత వాయు దళ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి రాఫేల్ జెట్ల రాకపై కీలక విషయాలను వెల్లడించారు. ఫ్రెంచ్ యుద్ధ విమానాల తయారీదారు దసో సంస్థతో 36 రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే 32 యుద్ధ విమానాలను ఆ దేశం డెలివరీ (Delivery) చేసింది. కాగా, మిగిలిన నాలుగు విమానాల్లో మూడింటిని ముందస్తుగా నిర్దేశించుకున్న షెడ్యూల్ మేరకే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డెలివరీ చేయనున్నట్టు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి (Air Chief Marshal VR Chaudhary) వెల్లడించారు. చివరి యుద్ధ విమానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాఫేల్ జెట్ల విషయంలో ఫ్రాన్స్కు ధన్యవాదాలు చెప్పాలని, ఎందుకంటే కరోనా లాంటి ఆటంకాలు వచ్చినా ముందస్తుగా అంగీకరించిన షెడ్యూల్ ప్రకారమే.. ఆ యుద్ధ విమానాలను భారత్కు అందించిందని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి అన్నారు. ఒప్పందం కుదిరిన 36 యుద్ధ విమానాలకు గాను 32 యుద్ధ విమానాలు ఇప్పటికే భారత్కు వచ్చాయని వివరించారు. మిగిలిన నాలుగు విమానాల్లో మూడు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్కు వస్తాయని తెలిపారు. కాగా, చివరి రాఫేల్ జెట్లో కొన్ిన మార్పులు చేర్పులు ఉంటాయని, అవి భారత్కు అనుకూల సౌలభ్యాలు వాటిలో ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఈ మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఆ ఫ్లైట్పై అన్ని ట్రయల్స్ చేస్తారని, ఆ ట్రయల్స్ అన్నీ సఫలం అయ్యాక దాన్ని భారత్కు తీసుకు వస్తారని పేర్కొన్నారు. అంతేకాదు, రాఫేల్ జెట్లకు భవిష్యత్లో మెయింటెనెన్స్ ఇష్యూల గురించీ తాము ఫ్రాన్స్ రక్షణ మంత్రితో మాట్లాడామని వివరించారు. ఇండియాలో డీ లెవెల్ మెయింటెనెన్స్ ఏర్పాటు చేయడానికి ఫ్రాన్స్ సిద్ధంగా ఉన్నదని తెలిపారు.
Also Read: రాఫేల్ డీల్లో మరో సంచలనం.. ‘ఆ ముడుపులపై ఆధారాలున్నా సీబీఐ దర్యాప్తు చేయలేదు’
భారత పర్యటనలో ఫ్రెంచ్ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ చైనా ప్రస్తావన తెచ్చారు. చైనా దూకుడుగా వ్యవహరిస్తున్నదని, దక్షిణ చైనా సముద్ర జలాల్లో మితిమీరి వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. అక్కడి జలాల్లో స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాము భారత్కు సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. భారత్ మరికొన్ని రాఫేల్ యుద్ధ విమానాలు కావాలని భావిస్తే తాము అందించడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు.
రాఫేల్ యుద్ధ విమానాలు భారత వాయు దళానికి కీలకంగా ఉన్నాయి. వాయు దళానికి సరికొత్త బలాన్ని సమకూర్చాయి. చైనాతో సరిహద్దులో ఘర్షణలు ఏర్పడి ఉద్రిక్తతలు నెలకొన్న సందర్భంలో ముందు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం రాఫేల్ యుద్ధ విమానాలను సరిహద్దుకు తరలించిన సంగత తెలిసిందే.