ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆమె రాకపై తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో తీవ్ర జర్చ జరిగిన విషయం తెలిసిందే. ఆమె రాక సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం, భద్రత విషయంతో శ్రద్ద తీసుకోవడం ఇలా ఇవాంక గురించి ప్రతి విషయం ఈ మద్య చర్చనీయాంశంగా మారాయి. కొన్ని రోజుల నుంచి అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు నగర ప్రజల ఉత్కంఠకు తెరదించుతూ ఇవాంక నగరంలో అడుగుపెట్టారు.
ఇవాళ తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు అమెరికా రాయబారి కెన్నత్ జుస్టర్, తెలంగాణ ప్రభుత్వం తరపున జయేశ్ రంజన్ మిశ్రా లు స్వాగతం పలికారు. అక్కడినుంచి ఆమె నేరుగా మాదాపూర్ లోని ట్రైడెంట్ హోటల్ కు చేరుకున్నారు. మద్యాహ్నం 3 గంటలకు ఇవాంక హెఐసిసి లో జరిగే జీఈఎస్ సదస్సులో పాల్గొననున్నారు.
ఈ రోజు మొదలయ్యే అంతర్జాతీయ సదస్సులో ఇవాంక పాల్గొననున్నారు. ఇవాళ మూడు గంటలకు హెచ్ఐసీసీ కి చేరుకోనున్న ఆమె మొదట ప్రధాని నరేంద్ర మోది, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ లతో భేటీ అవుతారు.అనంతరం జరిగే జీఈఎస్ సదస్సులో పలువురు వ్యాపారవేత్తలతో ఇవాంక మాట్లాడతారు. అనంతరం అక్కడినుంచి మళ్లీ ఆమె బసచేసిన ట్రైడెంట్ హోటల్ కు చేరుకుంటారు. మళ్లీ సాయంత్రం 6 గంటలకు కేంద్ర ప్రభుత్వం పలక్ నుమా ప్యాలెస్ లో ఇచ్చే విందులో పాల్గొంటారు. అక్కడినుంచి రాత్రి 10 గంటలకు ఇవాంక తాను బస చేసిన హోటల్ కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు.
అలాగే 29 వ తేదీన మళ్లీ 10 గంటలకు హెచ్ఐసీసీ కి చేరుకుని మరి కొంత మంది వ్యాపారవేత్తలతో ఇవాంక భేటీ అవుతారు. పలు ప్లీనరీల్లో పాల్గొంటారు. అన్ని కార్యక్రమాలను ముగించుకుని రాత్రి 9.20 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికాకు ఇవాంక తిరుగుప్రయాణం అవుతారు.