
రోజురోజుకీ రైల్వేల తీరు అద్వాన్నంగా మారుతోంది. రైళ్లల్లో ప్రయాణికులకు అందించే ఆహారం తినడానికి పనికిరాదని ..చాలా దారుణంగా ఉంటోందని కాగ్ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగ్ రైల్వే అధికారులపై అక్షింతలు వేసినప్పటికీ వారు తీరు మాత్రం మారలేదు. ఇందుకు నిదర్శనంగా మరో ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులు ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి కనిపించింది. దానిని తిన్న ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు.
వివరాల్లోకి వెళితే..ఝార్ఖండ్ నుంచి ఉత్తర్ప్రదేశ్కు వెళ్తున్న పూర్వ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న కొందరు వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. వారికి రైల్వే సిబ్బంది అందించిన బిర్యానీలో చనిపోయిన బల్లిని ఓ వ్యక్తి గుర్తించాడు. దీంతో భయబ్రాంతులకు గురైన ఇతర ప్రయాణికులు వెంటనే ఆ బిర్యానీని రైలు నుంచి బయటకు పడేశారు. బయట పడేసిన బిర్యానీలో ఇంకెన్ని బొద్దింకలు, బల్లులు ఉన్నాయోనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బిర్యానిని తిన్న ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. దీనిపై ప్రయాణికులు రైల్వే సిబ్బందికి, క్యాటరింగ్ నిర్వాహకులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు. దీంతో వారు రైల్వేశాఖ మంత్రి సురేశ్ప్రభుకు ట్వీట్ చేశారు. దీనిపై వెంటనే మంత్రి స్పందించారు. రైలు యూపీలోని మొఘల్సరాయి స్టేషన్లో ఆగగానే పలువురు రైల్వే అధికారులు వైద్యసిబ్బందిని వెంటబెట్టుకొని బాధితుల వద్దకు చేరుకొని వారికి చికిత్స అందించారు.
ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు సీనియర్ రైల్వే అధికారి కిశోర్కుమార్ వెల్లడించారు.