విశేష వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప జిల్లా ఎస్పీతో ఫోనులో మాట్లాడి ప్రమాదం ఘటన గురించి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలోఆరుగురు మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన, మృతదేహాలకు తక్షణం పోస్ట్ మార్టమ్ నిర్వహించి వారి స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి ఖాతాలోకి మరో అవార్డు వచ్చి చేరింది. ఉన్నత్ భారత్ అభియాన్ అవార్డును ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ అర్బన్ జిల్లాకు వచ్చింది. కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం ‘ఉన్నత్ భారత్ అభియాన్’ అవార్డును ప్రకటించింది. ఆ అవార్డును అందుకునేందుకు బుధవారమే కలెక్టర్ ఆమ్రపాలి ఢిల్లీ వెళ్లారు. ఇవాళ జరిగిన కార్యక్రమంలో కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేతులమీదుగా ఈ అవార్డు స్వీకరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకోసం నిధుల కొరత ఉండకుండా చూసేందుకు నీటిపారుదల శాఖకు 3 వేల కోట్ల రుణం తీసుకోడానికి అనుమతినిచ్చింది. తెలంగాణలోని జయశంర్ జిల్లాలోని ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ రుణాన్ని నీటిపారుదల శాఖ పంజాబ్ నేషనల్ భ్యంకు నుంచి తీసుకోనుంది.
హైదరాబాద్ : బతుకమ్మ వేడుకలను ఈ నెల 24 వ తేదీన న్యూజిలాండ్ లో అంగరంగవైభవంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ జాగృతి న్యూజిలాండ్ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ జాగృతి అద్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ సంబరాలకు సంభందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.న్యూజిలాండ్ జాగృతి ప్రతినిధులు ఇవాళ కవితను ఆమె నివాసంలో కలిశారు. ఆక్లాండ్ లో జరిగే ఈ వేడుకల్లో ఇతర రాష్ట్రాల వారిని కూడా భాగస్వామ్యం చేయాలని ఈ సందర్బంగా కవిత వారికి సూచించారు. అక్కడ జరిగే బతుకమ్మ వేడుకలను న్యూజిలాండ్ జాగృతి అధ్యక్షురాలు అరుణ జ్యోతి ముద్దం పర్యవేక్షించనున్నారు.
మత్స్యకారులందరు మత్స్య సహకార సంఘంలో సభ్యత్వం నమోదు చేసుకోవాలని తెలంగాణ మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. త్వరలోనే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి ఈ సంఘాల ద్వారానే మత్స్యకారుల సంక్షేమానికి ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు.
ఇవాళ కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన లోయర్ మానేర్ జలాశయంలో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వం తరపున చేపల మార్కెట్లు నిర్మించి వాటిలో మత్స్యకారులు మాత్రమే చేపలు అమ్ముకునేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తలసానితో పాటు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
యమునా నదిలో ప్రయాణిస్తున్న పడవ ఒకటి ప్రమాదానికి గురై మునిగిపోయిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో సంభవించింది. 60 ప్రయాణికులతో నదిలోకి వెళ్లిన పడవ బాగ్పాట్ వద్ద ప్రమాదకరంగా ముంపుకు గురైంది. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ ఇప్పటివరకు 12 మందిని మాత్రమే ప్రాణాలతో కాపాడగల్గింది. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు చేయడుతోంది.
అయితే ఈ విషయంపై స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రెండు లక్షల వరకు పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి ప్రభుత్వం తరపున వైద్యం అందింయనున్నట్లు హామీ ఇచ్చారు.
హైదరాబాద్ : దసరా నవరాత్రుల సందర్బంగా దుర్గా మాత విగ్రహాలను ఏర్పాటుచేయడానికి మండపాల నిర్వహకులు పోలీసుల నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆ నెల 18 వ తేది వరకు దరఖాస్తులు అందించి అనుమతి తీసుకోవచ్చని సిపి వివరించారు. పోలీస్ క్లియరెన్స్ వున్న విగ్రహాలకు మాత్రమే ఊరేగింపులకు, నిమజ్జనానికి అనుమతిస్తామని మహేందర్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో గ్రూప్2 నియామక ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకు ముందు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పై స్టే ఇచ్చిన కోర్టు, తాజాగా ఈ స్టే ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. టీఎస్ పిఎస్సి యదావిదిగా నిమామకం జరపవచ్చని, అభ్యర్దులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 9 కి వాయిదా వేసింది.
అభివృద్ది వైపు వడిడవడిగా అడుగులు వేస్తున్న భారత్ అందుకోసం మిత్ర దేశాల సహకారాన్ని పూర్తిగా వాడుకుంటోంది. అందులో భాగంగా జపాన్ సహకారంతో నిర్మిస్తున్న బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులకు జపాన్ ప్రధాని షింజో అబే తో కలిసి ప్రదాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో శంకుస్థాపన చేశారు. ముంబై నుంచి అహ్మదాబాద్ కు 508 కిలో మీటర్లు ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు.ఈ సహకారంతో జపాన్ ఇండియా ల మద్య సంభందాలు మరింత బలోపేతం అయ్యాయని జపాన్ ప్రధాని అబే తెలిపారు.
ఈ సందర్బంగా ప్రదాని మోదీ మాట్లాడుతూ హై స్పీడు రవాణ వ్యవస్థ ద్వారా దేశం లో అభివృద్ది కూడా హై స్పీడులో ముందుకు వెళుతుందని చమత్కరించారు.ఈ సంధర్బంగా ఆయన బుల్లెట్ ట్రైన్ నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తున్న జపాన్ ప్రభుత్వానికి, ప్రధానంగా ప్రధాని షింజో అబే కు ధన్యవాదాలు తెలిపారు.
వికారాబాద్ జిల్లా : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న 30 కోట్ల నిధులతో తాండూర్ మండలాన్ని అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ నిధులతో మండలం లోని అన్ని గ్రామాల్లో పట్టణ సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి తాండూర్ లో వివిధ అభివృద్ది పనులను ప్రారంభించారు. మొదట తాండూరులో రూర్బన్ కార్యక్రమం ప్రారంభించిన ఆయన అనంతరం అల్లాపూర్ లో సోలార్ విద్యుత్ యూనిట్ ను ప్రారంభించారు. అలాగే గౌతాపూర్ - చెంగోల్, తాండూరు - చెనిగెస్పూర్ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణాలకు,నగరాలకు దీటుగా తాండూర్ లో క్రీడా ప్రాంగణాలు, సోలార్ విద్యుత్ సదుపాయాలు, రోడ్లు,మురుగుకాల్వల నిర్మాణం, బస్ షెల్టర్ల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ దివ్య పాల్గొన్నారు.
కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు అనే పుస్తకం రాసిన ప్రొపెసర్ ఐలయ్య బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర పదజాలంతో విమర్శించాడు. మీడియాలో ప్రచారంకోసమే ఐలయ్య ఇలా హిందూ సమాజాన్ని కించపర్చేలా పుస్తకాలు రాస్తున్నాడని అన్నారు. ఆయన ఒక హిందూ కుటుంబంలో పుట్టి హిందూ సమాజాన్ని దూషిస్తూ పుస్తకాలు రాయడం తగదన్నారు.ఏపీ ప్రభుత్వం మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ పుస్తకాన్ని నిషేదించాలని డిమాండ్ చేశారు.